తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

Apr 24 2025 8:47 AM | Updated on Apr 24 2025 8:47 AM

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

● 2024–25లో రూ.26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్‌ఎస్టేట్‌ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలతోపాటు, స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్‌ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం.

రియల్‌ రంగం కుదేలే కారణం!

రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్‌, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్‌ సేల్‌ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్‌ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్‌ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది.

అనధికారిక లే అవుట్‌ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో..

అనధికారిక లేఅవుట్‌లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement