అనంతగిరి: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. ఆదివారం వికారాబాద్ ఆర్యవైశ్య భవనంలో అనంత పద్మనాభ స్వామి యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కమిషనర్ విక్రంసింహారెడ్డి, కౌన్సిలర్లు రమేష్కుమార్, రాఘవేందర్, అనిల్, యోగా గురువులు అశోక్, నారాయణ రాథోడ్, అనంతయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులకు అండంగా ఉంటాం
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
దోమ: మండల పరిధిలోని ఐనాపూర్లో జోగు చిన్న భీమయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదివారం మృతదేహాన్ని నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అదుపుతప్పి కారు బోల్తా
దోమ: అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన దోమ మండలం మోత్కూర్ గేట్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంచర్ల గ్రామం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనం కుల్కచర్ల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తోంది. అందులో డ్రైవర్తో పాటు ఓనర్ ఉన్నారు. ఈ క్రమంలో గేట్ సమీపంలోకి రాగానే వరాహం అడ్డువచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ దానిని తప్పించే యత్నంలో కారు.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
అ‘పూర్వ’ సమ్మేళనం
దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్లో 1991–92 బ్యాచ్ పదో తరగతి విద్యార్ధులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చాలా ఏళ్లకు అందరం కలుసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారికి విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.


