అనారోగ్యంతో భార్య,
గుండెపోటుతో భర్త మృతి
మోమిన్పేట: మృత్యువులోనూ దంపతులు అనుంబంధం వీడలేదు. ఈ ఘటన మండల పరిధిలోని ఏన్కతల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్యాట లక్ష్మయ్య, భాగ్యమ్మ దంపతులు. భాగ్యమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందింది. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భార్య మృతిని తట్టుకోలేక బాధపడుతున్న లక్ష్మయ్య రాత్రి 11గంటల సమయంలో గుండెపోటుతో మత్యువాత పడ్డాడు. వారికి ఒక కూతురు, కుమారుడు సంతానం.
బైక్ అదుపు తప్పి
యువకుడికి గాయాలు
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన బి.అరుణ్కుమార్ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు బైక్పై వస్తున్నాడు. మార్గమధ్యలో తహసీల్దార్ కార్యాలయంలో బైక్పై అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో 108లో ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి యాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలు అదృశ్యం
కుల్కచర్ల: ఇంటి నుండి బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమయింది. ఈ సంఘటన కుల్కచర్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బండవెల్కిచర్లకు చెందిన కొత్తబాయి వెంకటమ్మ(63) ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం ఉదయం ఆమె కుమార్తె లక్ష్మి ఫోన్ చేయగా బ్యాంకుకు వెళ్తున్నాని చెప్పింది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.


