న్యూస్రీల్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
లేదంటే కొర్రీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు క్షేత్రస్థాయిలోని పలువురు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసేందుకు చేయి చాస్తున్నారు. పట్టా భూములను అసైన్డ్గా నమోదు చేయడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహద్దు, సర్వే నంబర్లలో దొర్లిన తప్పుల సవరణ, భూస్వభావం, కేటగిరీ, యజమానుల పేర్లలో దొర్లిన తప్పులను సరి చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు అనేక కొర్రీలు పెట్టి.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన వాటిని కూడా పెండింగ్లో పెట్టి బేరసారాలకు దిగుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ల వద్ద 7,480 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, 2,508 ఆర్డీఓల వద్ద ఉన్నాయి. ఇక అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వద్ద ఏకంగా 6,825 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కలెక్టర్ వద్ద 2,659 దరఖాస్తులు పెండింగ్లో ఉండటం విశేషం.
ఒక్కో దశలో ఒక్కో రేటు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 17 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు మెజార్టీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’కి సగటున 60 నుంచి 100 వరకు అర్జీలు వస్తుంటాయి. అధికారులు ఆయా వినతులను క్షేత్రస్థాయికి పంపుతుంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజనిర్ధారణ చేసి తహసీల్దార్కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆయన తన ఆఫీసులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత నివేదికను ఆర్డీఓకు పంపుతుంటారు. ఆయన తన వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, తుది నివేదికను అదనపు కలెక్టర్/ కలెక్టర్కు పంపిస్తారు.
అధికారుల తీరుతో అగ్గువకే అమ్మకం
క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లు వాటిని ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తుంటారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రభుత్వ పెద్దలు రంగప్రవేశం చేసి, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు వారు ఆశించిన విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నిరాకరించిన వారి ఫైళ్లను కనీసం పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. అధికారుల తీరుతో ఎక్కడ భూమి తమకు కాకుండా పోతుందో అనే భయంతో బాధితులు కూడా మధ్యవర్తులను ఆశ్రయించి వారు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. ఇలా ఆర్ఐ నుంచి అదనపు కలెక్టర్ వరకు ప్రతి దశలోనూ భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికే ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్ఐలు ఏసీబీకి పట్టుబడటం తెలిసిందే. ఇక ఆర్థిక స్థోమత లేని పేద రైతులు తమ భూములను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
పెండింగ్లో ఉన్న దరఖాస్తులు
డివిజన్ తహసీల్దార్లు ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్
చేవెళ్ల 1,957 491 1,373 830
ఇబ్రహీంపట్నం 1,866 820 1,979 439
కందుకూరు 1,643 644 1,799 634
రాజేంద్రనగర్ 834 123 674 358
షాద్నగర్ 1,180 430 1,000 398


