సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ ఆహ్లాదకరంగా ముగిసింది. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన తొలి పోరును ఎంజాయ్ చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సన్రైజర్స్ జట్టు మ్యాచ్లో ఓడిపోయినా.. సెలవు రోజున మైదానానికి తరలి వచ్చిన 34,670 మందికి తగినంత వినోదం లభించింది. ఆరంభంలో సన్రైజర్స్ ఆటతో కాస్త నిరాశ కనిపించినా... నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ బౌండరీల వర్షంతో వారికి ఊరట లభించింది. అవతలి జట్టు కెప్టెన్ అయిన సరే... భారత ఆటగాడు కావడంతో రిషభ్ పంత్కు కూడా మైదానంలో భారీ మద్దతు లభించింది.
శుభ్రంగా లేని సీట్లు
మరోవైపు స్టేడియంలోని కొన్ని గ్యాలరీల్లో సీట్ల విషయంలో కాస్త అసంతృప్తి కనిపించింది. సీట్లు శుభ్రంగా లేకపోవడంతో ప్రేక్షకులే కర్చీఫ్లతో క్లీన్ చేసుకొని కూర్చున్నారు. సన్ గ్లాసెస్లను గ్రౌండ్లోకి అనుమతించే విషయంలో కూడా ఫ్యాన్స్, సెక్యూరిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లే వేర్వేరు గేట్ల నుంచి కొన్ని చోట్ల సన్ గ్లాసెస్ను అనుమతించగా, మరి కొన్ని గేట్ల వద్ద అడ్డుకోవడంతో వాటికి అక్కడే పడేసి లోపలికి వెళ్లాల్సి వచ్చింది.


