బకాయిలపై నజర్
30 లోపు చెల్లించండి
పీఏసీఎస్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు మార్చి 30లోపు అప్పు బకాయితో పాటు వడ్డీని కూడా చెల్లించండి. రైతుల్లో అవగాహన కోసం డీసీసీబీ ఉన్నతాధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రుణాలు చెల్లించకపోతే వారి ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. – నాగరాజు, సీఈఓ, పీఏసీఎస్
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో రుణాలు పొందిన రైతుల నుంచి బకాయిల వసూల్ చేయడానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 30 లోపు బకాయిలు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. సకాలంలో చెల్లిస్తే సరే.. లేదంటే వడ్డీ పెరిగి మరింతా అప్పుకుప్పలాగా మారుతుందని తెలియజేస్తున్నారు. యాచారం పీఏసీఎస్లో 8,832 మంది రైతులు(సభ్యత్వం పొందిన) ఉన్నారు. వారిలో ఫౌల్ట్రీ, డెయిరీ, మేకల, గొర్రెల తదితర పథకాల కింద 938 మంది దీర్ఘకాలికం కింద రూ.45 కోట్ల రుణాలు పొందారు. తమ పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న భూమిని పీఏసీఎస్ మీద మార్టిగేషన్ చేసి ఒక్కో రైతు రూ.10 నుంచి రూ.20 లక్షలకు పైగానే రుణం పొందారు. రెండు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో అప్పుతో సహా వడ్డీని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
లక్ష్యం రూ.35 కోట్లు
2026–27 ఏడాదికిగాను వసూళ్ల టార్గెట్ లక్ష్యం రూ.35 కోట్లు పెట్టుకున్నారు. గతేడాది సైతం అనుకున్న విధంగా బకాయిలు వసూలు కాకపోవడంతో రైతులకు అపరాధ వడ్డీ అధికంగా పడింది. అంత భారాన్ని చెల్లించలేని దుస్థితికి చాలామంది వెళ్లారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని డీసీసీబీ, పీఏసీఎస్ అధికారులు సంయుక్తంగా స్పెషల్డ్రైవ్కు సంకల్పించారు. మార్చి 30 లోపు అప్పు వాయిదాతో కూడిన బకాయిని చెల్లించేలా రైతులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అప్పు వాయిదాలు చెల్లించని రైతులకు ఆ తర్వాత నోటీసులు జారీ చేసి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వసూల్ చేయాల్సిన టార్గెట్ రూ.35 కోట్లల్లో కనీసం రూ.20 కోట్లకు పైగా వసూల్ చేయకపోతే రుణాల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వడం కష్టమేనని అధికారులు అంటున్నారు.
పంట రుణాలు అంతే
యాచారం పీఏసీఎస్లో వ్యవసాయ పంట రుణాలను కూడా రైతులు తీసుకున్నారు. 1,102 మంది రైతులు రూ.13 కోట్లకు పైగా పంట రుణాలను పొందారు. రైతులు సైతం మార్చి 30 లోపు రెన్యూవల్ లేదా.. వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేయించి వడ్డీ చెల్లిస్తే ఏడు శాతం, అదే గడువు దాటితే మాత్రం 13 శాతం వడ్డీ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం రూ.13 కోట్ల పంట రుణాల్లో రూ.నాలుగు కోట్లకు పైగానే ఫార్మాసిటీకి భూములిచ్చిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద రైతులతో పాటు అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ వేసిన మొండిగౌరెల్లి రైతులు ఉన్నారు.
పీఏసీఎస్లో అప్పు వసూలుకు స్పెషల్ డ్రైవ్
ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు
చెల్లించాలని సూచన
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
బకాయిలపై నజర్


