ఆడపిల్లేనని అమ్మేశారు
● రూ.3 లక్షలకు శిశువు విక్రయం
● కేసు నమోదు చేసిన పోలీసులు
● పాపను శిశువిహార్కు తరలింపు
షాద్నగర్: మూడో సంతానంగా ఆడపిల్లే పుట్టిందని.. కన్నోళ్లు వద్దనుకున్నారు. అల్లాడే పసి ప్రాణంకన్నా.. కొంతమంది డబ్బే ప్రధానమనుకున్నారు. ఫలితంగా అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. షాద్నగర్లో మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ పంచాయతీ లాల్సింగ్తండాకు చెందిన వినోద్, రేణుక భార్యాభర్తలు. రేణుక ఏడు నెలల గర్భిణిగా ఉండగా, గత నవంబర్ 9న హైదరాబాద్లోని జజ్జిఖానా ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం భార్యాభర్తలు తండాకు వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా తల్లి వద్ద పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక అంగన్వాడీ టీచర్ చింటు జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు, ఆపరేషన్ స్మైల్ టీం బృందంతో విచారణ చేయించారు. ఈ క్రమంలో కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన గోవింద్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు బిడ్డను విక్రయించారని తేలింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో మూడో పాపను వదిలించుకునేందుకు రేణుక, వినోద్ సిద్ధమయ్యారని తేలింది. జజ్జిఖానా ఆస్పత్రిలో పనిచేసే పలువురు సిబ్బందితో పాటు గోవింద్ మధ్యవర్తిత్వంలో అత్తాపూర్కు చెందిన వారికి రూ.3 లక్షలకు పాపను విక్రయించారు. డిసెంబర్ 31న షాద్నగర్ బస్టాండ్లో మధ్యవర్తులకు శిశువును అప్పగించారు. ఈ వివరాలతో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు శిశువిహార్కు తరలించారు. శిశువు విక్రయం వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


