కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే పోటీ చేయం
ఆమనగల్లు: కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా, ఆమనగల్లులో వివిధ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పట్టణాల్లో బీజేపీ పోటీ చేయదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని, ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా తమ ప్రాంత అభివృద్దే ధ్యేయమని అన్నారు. అందుకే కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిస్తే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పోటీ నుంచి తప్పుకొంటుదని చెప్పారు. కల్వకుర్తిని వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ఆమనగల్లు పట్టణంలో ఆర్డీఓ, సబ్రిజిస్ట్రేషన్, ఆర్టీఓ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీటి ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి వెంటనే అంగీకరించాలని పేర్కొన్నారు.


