చెరువులను పునరుద్ధరించండి
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని చెరువులతో పాటు వాటికి అనుసంధానం చేసి ఉండే వరద కాలువలను కాపాడాలంటూ పలువురు హైడ్రాకు వినతులు అందించారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్, ప్రగతినగర్ చెరువు, కాటేదాన్లోని నూర్ మహ్మద్కుంట, ఫిల్మ్నగర్ చెరువు ఇలా చెరువులను అభివృద్ధి చేయాలని నగరం నలువైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అంబర్పేటలోని బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, పాతబస్తీలోని బమ్రుక్ ఉద్ దౌలా చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారాయని.. తమ ప్రాంతంలో ఉన్న చెరువులను అలా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 76 ఫిర్యాదులు వచ్చాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకుని ఉన్న ఫాక్స్ సాగర్ కబ్జాలను తొలగించి, మరో ట్యాంక్బండ్గా అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు కోరారు. గౌరెల్లి గ్రామంలో సర్వే నెం.223లో ఉన్న మాలకుంట చెరువును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. కొండాపూర్ సీఎంసీ లేఔట్లోని రహదారి ఆక్రమణకు గురవుతోందని నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పెద్ద అంబర్పేటలోని బాలాజీ లే ఔట్ను ఆనుకుని ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును కలుపుతూ 40 ఫీట్ల రహదారిని ఆక్రమించి.. ఏకంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో ఆ లే ఔట్లోని ఇతర ప్లాట్లకు దారి లేకుండా పోయిందని ప్లాట్ యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
హైడ్రా ప్రజావాణిలో 76 ఫిర్యాదులు


