ఆమే కీలకం
● మండలంలోని పది గ్రామాల్లో మహిళా ఓటర్లే అధికం
● సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్న అతివలు
ఇబ్రహీంపట్నం: మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు, 140 వార్డులకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31,835 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,780, మహిళలు 16,053 మంది, ఇతరులు ఇద్దరున్నారు. పురుషులకంటే 273 మంది మహిళలే అధికంగా ఉన్నారు.
ఒక్కో ఓటు కీలకమే..
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. అవే ఫలితాలను తారుమారు చేస్తాయి. ఏ ఒక్క ఓటు చేజారకుండా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేశారు.
అతి తక్కువగా కర్ణంగూడలో ..
మండలంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కర్ణంగూడ. ఈ గ్రామంలో కేవలం 697 మంది ఓటర్లే ఉండటం గమనార్హం. అదేవిధంగా అత్యధికంగా దండుమైలారంలో 4,959 మంది ఉన్నారు. సుమారు రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికల కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గెలవడం ఓ పరీక్షలా మారింది. అంగ, అర్థ, బంధు బలగాలతో ప్రచారంతోపాటు, ఓటర్లకు తాయిలాలను సమర్పించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలతో పంచాయతీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇక ఓటర్ల తీర్పు ఏరకంగా ఉంటుందో వేచిచూడాల్సిందే.
గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు
గ్రామపంచాయతీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
చర్లపటేల్ గూడ 951 941 – 1,892
దండుమైలారం 2,456 2,503 – 4,959
ఎలిమినేడు 1,653 1,734 – 3,387
కప్పపహాడ్ 909 935 – 1,844
కర్ణంగూడ 339 358 – 697
ముకునూర్ 591 579 1 1,171
నాగన్పల్లి 865 864 1 1,730
నెర్రపల్లి 710 542 – 1,052
పోచారం 1,083 1,088 – 2,171
పోల్కంపల్లి 1,646 1610 – 3,256
రాయపోల్ 2,475 2,481 – 4,956
తుర్కగూడ 505 546 – 1,051
తులేకలాన్ 942 1,000 – 1,942
ఉప్పరిగూడ 855 872 – 1,727


