ఐదేళ్లకు.. అమ్మదయ
● ఒకే వ్యక్తికి రెండు గ్రామాల్లో ఓటు హక్కు
● ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు
● భూదాతను వరించిన సర్పంచ్ పదవి
● ఏకగ్రీవానికి తీర్మానించిన మక్తవెంకటాపూర్ గ్రామస్తులు
కుల్కచర్ల: పంచాయతీ ఎన్నికల్లో ఓ వైపు విచిత్రమైన పొత్తులు పొడుస్తుండగా.. మరో వైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ పలు గ్రామాల పెద్దలు తీర్మానిస్తున్నారు. చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్ పంచాయతీ పరిధిలో గతేడాది అమ్మవారు, సేవాలాల్ ఆలయాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాల నిర్మాణానికి గ్రామానికి చెందిన జరుప్ల కవిత కుటుంబీకులు ఐదేళ్ల క్రితం 26 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చారు. ఆసమయంలో గ్రామస్తులు మీ కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని మాటిచ్చారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. గ్రామ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కవిత తనను ఏకగ్రీవం చేయాలని కోరింది. దీంతో గ్రామ పెద్దలు ఆయా పార్టీల నాయకులతో మాట్లాడి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో సోమవారం కవిత మినహాయిస్తే మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నేడు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఓ‘టు’
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబి తాలు తప్పుల తడకగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో జాబితాను అస్తవ్యస్తంగా తయారు చేశారు. దీంతో మూడేళ్ల క్రితం చెందిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వీటిని చూసి తలలు పట్టుకుంటున్నారు. దౌల్తాబాద్ మండలం బిచ్చాలకు చెందిన చెన్నకేశవులుగౌడ్కు బిచ్చాలతో పాటు దౌల్తాబాద్ ఇంటి నంబర్ 2–24లో ఓటు ఉంది. దేశాయిపల్లికి చెందిన లోకపల్లి సంగీతకు స్వగ్రామంతో పాటు దౌల్తాబాద్ 19–20లోనూ ఓటు హక్కు కల్పించారు.


