మంచి ముహూర్తం ఎంచుకుని!
ఒకేసారి తరలివస్తున్న అభ్యర్థులు
● నామినేషన్ల ప్రక్రియకు ఎక్కువ సమయం
ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ముహూర్తం చూసుకుని వస్తుండటంతో నామినేషన్లకు ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. రెండో రోజైన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని భావించిన పోటీదారులు సాయంత్రం 4గంటల తర్వాత క్లస్టర్ ఆఫీసుకు క్యూ కట్టారు. వీరికి టోకెన్లు ఇచ్చిన అధికారులు, లైన్లో కూర్చోబెట్టి రాత్రి 8గంటల వరకు నామినేషన్లు స్వీకరించినా.. ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఎన్నికల అధికారులు సైతం ఇబ్బంది పడ్డారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని, అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు.
రాత్రిపూట నామినేషన్లు
కందుకూరు: మండల పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 35 గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 52, వార్డులకు 388 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ సరిత తెలిపారు. రెండు రోజులు కలిపి మొత్తం సర్పంచ్లకు 91, వార్డులకు 458 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు.


