
తల్లీకూతురు అదృశ్యం
మొయినాబాద్: భర్తతో గొడవపడి కూతురుతో కలిసి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లికి చెందిన గుగులోత్ సునీత ఈ నెల 13న భర్త మోహన్నాయక్తో చిన్న గొడవపడి కూతురు మీనాక్షిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో భర్త పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
పొరిగింటి వారితో గొడవపడి గృహిణి..
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీలో పోచన నర్సింలు, భార్య మహేశ్వరి(44) నివాసం ఉంటున్నారు. వీరి పొరుగింటికి చెందిన వ్యక్తి కారును వీరి ఇంటి ఆవరణలో పార్కు చేస్తుండడంతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీనా సైతం మహేశ్వరి పొరుగింటి వారితో గొడవ పడిన విషయం తెలుసుకున్న నర్సింలు ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతంలో ఒక పర్యాయం ఇలాగే వెళ్లి తిరిగొచ్చింది. ఈ సారి మాత్రం ఎంతకీ రాకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలన్నారు.
కంకిరాళ్ల తండాలో విద్యార్థి..
కేశంపేట: హాస్టల్కు వెళ్తున్నాన్ని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని కంకిరాళ్ల తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజ్కుమార్ తెలిపిన ప్రకారం.. పుట్టోనిగూడ అనుబంధ గ్రామం కంకిరాళ్ల తండాకు చెందిన పాత్లావత్ రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పాత్లావత్ అరుణ్ కొత్తపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న తండ్రి రవి తన కొడుకును హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. 15వ తేదీన ఉదయం విద్యార్థి అరుణ్ హాస్టల్కు వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. అదే రోజు సాయంత్రం రవి హాస్టల్కు ఫోన్ చేయగా హాస్టల్కు రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గద్వాల్లో బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
అదుపు తప్పిన బైక్
యువకుడి దుర్మరణం
మీర్పేట: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గాయపడ్డారు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపిన ప్రకారం.. ప్రశాంతిహిల్స్కు చెందిన భూపతిరెడ్డి కుమారుడు అక్షిత్రెడ్డి(21) డిగ్రీ పూర్తి చేశాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడు రాజారామ్తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై ప్రశాంతి హిల్స్ నుంచి అల్మాస్గూడ కమాన్వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అక్షిత్రెడ్డి రోడ్డుపై పడిపోగా రాజారామ్ ఎదురుగా వస్తున్న స్కూటీపై పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అక్షిత్రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లీకూతురు అదృశ్యం

తల్లీకూతురు అదృశ్యం

తల్లీకూతురు అదృశ్యం