
డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్నగర్: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 176 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులో 21, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్లో 45, బీఎస్సీ లైఫ్సైన్స్లో 31, బీఏ తెలుగు మీడియంలో 40, బీబీఏలో 39 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ నర్సింహను కలవాలని సూచించారు.
మొయినాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండిన సురంగల్ పెద్ద చెరువుకు చిన్నపాటి గండిపడటంతో అధికారులు సకాలంలో స్పందించారు. గండి పూడ్చి మరమ్మతులు చేయించడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి కొన్ని రోజులుగా వరద రావడంతో పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కట్టకు చిన్నపాటి గండి పడి నీళ్లు కిందికి వెళ్తున్నాయి. గండి పెద్దది కాకముందే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇరిగేషన్ ఏఈ ప్రియాంక, ఆర్ఐ రాజేష్, వర్క్ఇన్స్పెక్టర్ నర్సింహ తదితరులు శనివారం చెరువు వద్దకు చేరుకుని కట్టను పరిశీలించారు. మట్టి పోసి కట్టకు పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయించారు.
ఆమనగల్లు: మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో శనివారం ఆయనను కలిసి పార్టీ గురించి చర్చించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్రావ్ ఉన్నారు.
ఆర్టీసీ వినూత్న ప్రయోగం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప తెలిపారు. దాతల ద్వారా సేకరించిన విరాళాలతో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్ర ప్రవేశపెడుతోందని చెప్పారు. దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం