
రేపు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
మొయినాబాద్: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. గ్రహణం ముగిసిన తరువాత ఆలయ సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించి భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.
షాద్నగర్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షాద్నగర్కు చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రాంరెడ్డిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అధ్యక్షుడిగా నియమితుడైన వెంకట్రాంరెడ్డి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు.
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కె.బాలాజీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. తనను ఎంపిక చేసిన అధికారులు, సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతగిరి: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ను మార్చాలని దేవరాంపల్లి రైతులు కోరారు. శుక్రవారం వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్కుమార్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రీజినల్ రింగ్రోడ్డు ప్రతిపాదిత భూముల జాబితాలో మా గ్రామం ఉందని, పేద రైతులకు చెందిన పొలాలు ఉన్నాయని తెలిపారు. భూములు కోల్పోతే ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వేరే ప్రాంతం నుంచి ప్రతిపాదించాలని కోరారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నామని, భూములు పోతే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గ్రామాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందన్నారు. రైతులకు నష్టం జరగని ప్రాంతాల నుంచి రోడ్డును ప్రతిపాదించాలని వారు కోరారు. ఈ విషయమై తాను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ హామీ ఇచ్చి నట్లు రైతులు తెలిపారు.