
చికిత్స పొందుతున్న మహిళ మృతి
స్కూటీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు
మొయినాబాద్: కారు, స్కూటీని ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలోని ఈ నెల 25న స్కూటీపై వెళ్తున్న మహిళను ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో హిమాయత్నగర్లో అద్దెకుండే ఖైరతాబాద్కు చెందిన అశ్విని(37), మేడిపల్లికి చెందిన సుశీల(60) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన అశ్విని మరుదలు లక్ష్మి(35) నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జయరాం కుటుంబం తుక్కుగూడలోని నార్త్ స్టార్ ఏర్పోర్ట్ బాలియార్డ్ విల్లాలో నివాసం ఉంటోంది. ఈయన కుమార్తె సురేఖ వెంకట దుర్గ(24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి వెంకట దుర్గ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. శివ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు
పెంచుతున్న వ్యక్తి అరెస్టు
శంషాబాద్ రూరల్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఊట్పల్లిలో ఉన్న డైమండ్ ఎస్టేట్ కాలనీలో తారకేశ్వర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి ఖైనీ, గుట్కా నమలడం అలవాటు ఉంది. ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి వీటిని అతను ఓఆర్ఆర్ వంతెన వద్ద కొంత మంది ద్వారా కొనుగోలు చేస్తున్నాడు. వాటితో పాటు వారు ఇతనికి గంజాయిని కూడా విక్రయించారు. గంజాయిలో విత్తనాలు కనిపించగా..వాటిని తన ఇంటి ఆవరణలో కూరగాయాలతో పాటు పెంచుతున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని ఇంటికి వెళ్లి విచారణ చేయడంతో గంజాయి మొక్కలు కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బుతో ఉడాయించిన
వ్యక్తిపై ఫిర్యాదు
రాజేంద్రనగర్: ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడాయించిన నేరస్తుడి కోసం రాజేంద్రనగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..కిస్మత్పూర్లో ఓ వ్యక్తి తన చిల్లర దుకాణంలోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ను చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి (30) ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.75 వేల నగదు కావాలని కోరాడు. డబ్బులు అర్జెంట్ ఉందని..రూ.5 వేలు అదనంగా ఇస్తానని తెలిపాడు. దీంతో దుకాణ నిర్వాహకుడు డబ్బును గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చాడు. ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటూ అతన్ని మాటల్లో దింపి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు హిమాయత్సాగర్కు చెందిన పాత నేరస్తుడిగా గుర్తించారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నేడు శ్రీరాంనగర్ ఎన్నికలు
మణికొండ: శ్రీరాంనగర్ (సెక్రటేరియట్) కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం కమ్యూనిటీహాల్లో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కౌటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి పదవులకు పోటీ అధికం కావడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మిగతా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయిందన్నారు.