
9999 @ రూ.5.50 లక్షలు
షాద్నగర్ః ఫ్యాన్సీ నంబర్లపై వాహన యజమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. తమకు ఇష్టమైన, కలిసొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఎంత చెల్లించడానికై నా వెనుకంజ వేయడం లేదు. షాద్నగర్లోని రవాణా కార్యాలయంలో శనివారం జరిగిన వేలంలో టీజీ 07బీ 9999 నంబర్ ఏకంగా రూ.5.50 లక్షలు పలికింది. కంసాన్పల్లికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బసిరెడ్డి పద్మ నరేందర్రెడ్డి తన ఓల్వో కారుకు ఈ నంబర్ను వేలంలో దక్కించుకున్నాడు.
న్యాయపరిపాలనలో
శిక్షణకు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ పరిపాలనలో శిక్షణకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్చే గుర్తించిన ఇన్స్టిటూషన్స్, సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ లేదా ఇన్ కార్పొరేషన్ చేసిన లేదా స్థాపించబడిన దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి ఏదేని ఫ్యాకల్టీలో బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొందిన వారు అర్హులని తెలిపారు. వార్షికాదాయం రూ.2 లక్షలు మించొద్దని, అభ్యర్థి గత సంవత్సరంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండకూడదని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులు న్యాయ పరిపాలనలో మూడేళ్ల వ్యవధికి శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.3వేలు స్టయిఫండ్, మొదటి సంవత్సరం లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జిల్లా కోర్టులు, మొబైల్ కోర్టులు, సెషన్ కోర్టు, డివిజన్ స్థాయి, తాలుకా స్థాయి కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 30న ఒరిజినల్ సర్టిఫికెట్లతో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
గౌడ సంఘం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా అనురాధ
హయత్నగర్: అఖిల భారత గౌడ సంఘం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూర్కు చెందిన మాడుగుల అనురాధ నియమితులయ్యారు. చింతల్కుంటలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్ చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. గౌడ విద్యార్థులు, మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లేషంగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగోని నాగేష్గౌడ్, ఉపాధ్యక్షుడు బోయిపల్లి శేఖర్గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, జిల్లా ఉపాధ్యక్షుడు పండాల దశరథగౌడ్, కార్యదర్శి గోపగాని వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు.
భూ బాధితులకు సుంకాల నుంచి మినహాయింపు
మహేశ్వరం: మండల పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్సిటీ (ఈ–సిటీ)లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం 222 మంది రైతులకు స్టాంపు, రిజిస్ట్రేషన్, సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. టీజీఐఐసీ అధికారులు హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం హౌసింగ్ లేఅవుట్ అభివృద్ధి పర్చి అందులో అన్ని వసతులతో ప్లాట్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే ప్లాట్లకు స్టాంపు, రిజిస్ట్రేషన్, ఇతర సుంకాల నుంచి రూ.3,72,91,500 మినహాయింపు ఇచ్చినట్లు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, టీజీఐఐసీ శంషాబాద్ జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చదరపు గజానికి రూ.2,800 స్టాంపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు చేసుకోండి
అనంతగిరి: హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో 2025 – 26 సంవత్సరానికి సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉచిత శిక్షణ కోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.