● ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు
● నేడు భారీగా దాఖలయ్యే అవకాశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన ఈ ప్రక్రియ బుధవారం ఐదో రోజుకు చేరింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 45 మంది అభ్యర్థులు 59 నామినేషన్ సెట్లు వేశారు. మహేశ్వరం నుంచి ఐదుగురు అభ్యర్థులు ఆరు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (రెండు సెట్లు), బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితారెడ్డి తరపున ఆమె మద్దతుదారులు ఒక సెట్ చొప్పున దాఖలు చేశారు. కల్వకుర్తి నుంచి ఆరు నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ రెండుసెట్లు దాఖలు చేశారు. షాద్నగర్ నుంచి ఎనిమిది నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, బీజేపీ అభ్యర్థి అందె బాబయ్య ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి ఐదు నామినేషన్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్ నుంచి ఎనిమిది నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి మూడు సెట్లు వేశారు. శేరిలింగంపల్లిలో 13 నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ నాలుగు సెట్లు అందజేశారు. ఇక చేవెళ్ల నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సున్నపు వసంతం నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ నుంచి 12 నామినేషన్లు వచ్చాయి. గురువారం మంచి ముహూర్తం ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment