అభివృద్ధిలో మనమే ఆదర్శం
మహేశ్వరం: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో వృద్ధులకు రూ.800 పింఛన్ ఇస్తే తెలంగాణలో సీఎం కేసీఆర్ అత్యధికంగా రూ.2 వేలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అమీర్పేట్లో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్, దళిత బంధు పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేస్తుంటే ఓర్వలేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. పేదలు, మహిళలపై అభిమానం ఉంటే రాష్ట్రంలో గ్యాస్ ధరలు తగ్గించమని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మోదీని అడగాలని కోరారు. దళితబంధులా త్వరలో గిరిజన, బీసీ బంధులను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమీర్పేట్ను కొత్త మండలముగా ప్రకటిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారం చేసినా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతకు ముందు మన్సాన్పల్లి చౌరస్తా నుంచి సుమారు 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, కార్యదర్శి జి.అంజయ్య ముదిరాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు వి.మల్లేశ్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, వ ర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గాదె థామస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు పాండు యాదవ్ డి.వెంకటేశ్వరరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, అమీర్పేట్ ఎంపీటీసీ కుమారి రాయప్ప, ఉప సర్పంచ్ నర్సింగ్, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు,నాయకులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న మహిళలను సన్మానించి అవార్డులు అందజేశారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
సంక్షేమ పథకాలు ఏవీ?
ఓర్వలేకే ఆ పార్టీ నేతల విమర్శలు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి సబితారెడ్డి