ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెంలోని కేసీఆర్ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కొరుతూ మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ నెల రోజులుగా నీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆదివారం పంపిన ట్యాంకర్ సరిపోలేదని, మొదటి అంతస్తులో ఉన్న వారికి మరింత ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లపైన ట్యాంకులు పెట్టలేదని, పైపులైన్ వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటి సమస్యను పరిష్కరించాల ని మాజీ సర్పంచ్ సరిత కోరారు. అంజవ్వ, ప్రమీల, శ్రీనివాస్రావు, నర్సవ్వ పాల్గొన్నారు.
24 నుంచి మార్కండేయ పురాణ సప్తాహం
సిరిసిల్లటౌన్: బీవైనగర్లోని శ్రీహనుమాన్ పరివార్ మందిరంలో ఈనెల 24 నుంచి 30 వరకు శ్రీమార్కండేయ పురాణ సప్తాహం నిర్వహిస్తున్నారు. ఈమేరకు కరపత్రాలను ఆదివారం గీతా ప్రచార సేవాసమితి అధ్యక్షుడు కోడం నారాయణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ స్వామిని దీక్షితానందభారతి మాత మార్కండేయ పురాణంపై ప్రవచనం వినిపిస్తారని తెలిపారు. 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి నరేశ్, సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఏనుగుల ఎల్లయ్య, ఆలయ అధ్యక్షుడు లకావత్ మోతిలాల్నాయక్, చిన్మయ మిషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఫ్లెక్సీలో జిల్లా విద్యార్థినులకు చోటు
ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్స్కూల్ 10వ తరగతి విద్యార్థిని మెడకొక్కుల హర్షిని, సిరిసిల్ల హైస్కూల్ విద్యార్థిని సిరికి చోటు దక్కింది. ‘సర్కారు బడి – సక్సెస్కు ఒడి’ పేరుతో ఏర్పా టు చేసిన ఫ్లెక్సీలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలు, వివరాలు పొందుపర్చా రు. సిరి 589, హర్షిని 588 మార్కులు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు. హర్షినిని ప్రిన్సిపాల్ గంగాధర్ అభినందించారు.
తైక్వాండో పోటీల్లో కాంస్యం
కోనరావుపేట(వేములవాడ): 16వ జాతీయస్థాయి ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో మండలంలోని కనగర్తి విద్యార్థిని సత్తాచాటింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో పుట్ట శరణ్య కాంస్యం సాధించినట్లు సన్రైజ్ తైక్వాండో అకాడమీ కోచ్ మంగళగిరి శ్రీనివాస్ తెలిపారు.
గోశాలకు 65 ట్రాక్టర్ల గడ్డి
వేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని రాజన్న గోశాలకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు 65 ట్రాక్టర్ల వరిగడ్డిని అందజేశారు. పెద్దపెల్లి జిల్లా కనుకుల, మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు 65 ట్రాక్టర్ల వరి గడ్డిని గోశాలకు అందించారు. ఈ సందర్భంగా రైతులకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితరులు పాల్గొన్నారు.


