తంగళ్లపల్లి(సిరిసిల్ల): పరిసరాల పరిశుభ్రతతో డెంగీని నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం తంగళ్లపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడుతూ ఈ ఏడాది ‘ఐక్యమవ్వండి.. చర్యలు తీసుకోండి.. డెంగీని నివారించండి‘ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. ఇళ్లలోని నీటితొట్లను, కుండలను, కూలర్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కిటికీలకు జాలీలు అమర్చుకోవాలని సూచించారు. 104 డిగ్రీల తీవ్ర జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాల నొ ప్పులు, వాంతులు ఉంటే డెంగీ ప్రాథమిక లక్షణా లుగా గుర్తించి సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో మీర్జా, వైద్యులు అనిత, సంపత్, స్నేహ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, మోహన్, రాజు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
లారీల కోసం బైఠాయింపు
ఇల్లంతకుంట(మానకొండూర్): కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదని ట్రాక్టర్లతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతుందని మండలంలోని అనంతారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు శనివారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ట్రాక్టర్ల ద్వారా వెళ్లిన ధాన్యం అన్లోడింగ్కు జాప్యమవుతుంద న్నారు. ఎస్సై సిరిసిల్ల అశోక్, ఎస్సై–2 లక్పతి చేరుకున్నారు. ఎస్సై అశోక్ తహసీల్దార్తో మాట్లాడి లా రీలు వస్తాయన్న విషయాన్ని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల నిరసన తర్వాత అనంతారం కొనుగోలు కేంద్రానికి ఓ లారీని పంపినట్లు ఆర్ఐ సంతోష్ తెలిపారు.
ఇక ఎన్పీడీసీఎల్లో ‘వన్ మినిట్ రూల్’
సిరిసిల్లటౌన్: టీజీఎన్పీడీసీఎల్ సిరిసిల్ల సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ వన్ మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపెరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణుమాధవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతీ ఉద్యోగి ఒక నిమిషం సమయం తీసుకుని భద్రత ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక భద్రతా విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ‘ఒక్క నిమిషం జాగ్రత్త’ సిబ్బంది ప్రాణాలను కాపాడగలదని ధీమా వ్యక్తం చేశారు.


