● ఇల్లంతకుంటలో రైతుల ధర్నా
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల వ్యవసాయ మార్కెట్కు పొద్దుతిరుగుడు తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనడం లేదంటూ రైతులు గురువారం మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. మండలంలోని పత్తికుంటపల్లి, ఆరెపల్లి, గాలిపల్లి, కేసన్నపల్లి, ముస్కానిపేట, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతులు ఇల్లంతకుంట బిక్కవాగు బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. అనంతరం ర్యాలీగా మండల కేంద్రంలోని వివేకానందచౌరస్తా వద్దకు వచ్చి ధర్నాకు దిగి, వంటావార్పు చేపట్టారు. 2300 క్వింటాళ్లు మాత్రమే కొని మిగతావి కొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వేసినప్పుడు వ్యవసాయాధికారులు సర్వే చేశారని, దాని ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్పెడ్ డీఎం అబీబ్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే కొంటామని, మూడు రోజులు ఓపిక పట్టాలని కోరారు. తహసీల్దార్ సురేష్, ఎస్సై అశోక్ రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు. రైతులకు సంఘీభావంగా మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కరికె నవీన్కుమార్, మామిడి హరీశ్ పాల్గొన్నారు.


