సిరిసిల్ల: బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. సిరిసిల్ల సబ్డివిజన్ పరిధిలోని బ్యాంకు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ప్రతీ బ్యాంకు, ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దోపిడీలు, అనుమానాస్పద ఘటనల సమయంలో సిబ్బంది ఎలా స్పందించాలనే అంశంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంకు ప్రవేశద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, గార్డులకు హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏటీఎంలలో నగదు నింపే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


