చందుర్తి(వేములవాడ): సైడ్.. సైడ్ ప్లీజ్..! అంటూ లారీ డ్రైవర్లు వేములవాడ–కోరుట్ల ప్రధాన రహదారిపై భయం.. భయంగా నడుపుతున్నారు. చందుర్తి మండలం లింగంపేట నుంచి మండల కేంద్రం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా చెట్లకొమ్మలు అల్లుకుపోయాయి. ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీలకు ఆ చెట్లకొమ్మలు తాకుతుండడంతో బస్తాలు చినిగిపోతున్నాయని డ్రైవర్లు తెలిపారు. ఇలాగే ధాన్యం కిందపోయి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో ఈ రెండు గ్రామాల మధ్య లారీలను కుడివైపు నుంచి తీసుకెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వచ్చే వాహనదారులు అప్రమత్తం కావాలని హారన్ కొడుతుంటారు. రోడ్డుపై లోడ్ లారీలకు తాకేలా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.


