● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
చందుర్తి/వేములవాడరూరల్/రుద్రంగి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, వేములవాడ మండలం మల్లారం, మర్రిపల్లి, రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. వేములవాడ మండలం మర్రిపల్లిలోని మారుతి, మహాలక్ష్మి, మణికంఠ రైస్మిల్లులను తనిఖీ చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సీరియల్ నంబర్ ప్రకారం కాంటాలు పెట్టాలని సూచించారు. ధాన్యాన్ని జాప్యం చేయకుండా తూకం వేయాలని ఆదేశించారు. సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ భూపతి, ఐకేపీ ఏపీఎం కల్యాణి, ఆర్ఐ మహేందర్ ఉన్నారు. రుద్రంగి, చందుర్తి తహసీల్దార్లు పుష్పలత, భూపతి ఉన్నారు.


