గ్రామీణాభివృద్ధి శిక్షణలో సర్పంచులు
● జిల్లా నుంచి ఐదుగురు హాజరు
చందుర్తి(వేములవాడ): గ్రామీణుల జీవన ప్రమాణాల పెంపు, ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో సర్పంచులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నుంచి ఐదు గ్రామాల సర్పంచులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికస్థితిని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పేదరిక నిర్మూలన వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు జాతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పంచాయతీరాజ్ శాఖ ఆఫీస్లో నిర్వహిస్తున్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీష, ముస్తాబాద్ మండలం గూడూరు సర్పంచ్ సీహెచ్.సునీత, వేములవాడ అర్బన్ మండలం అనుపురం సర్పంచ్ ఎస్.రాజేశ్వరీ, గంభీరావుపేట మండలం దేశాయిపేట సర్పంచ్ జి.పద్మ, తంగళ్లపల్లి మండలం చింతలఠాణా సర్పంచ్ జి.అనసూయ సోమవారం తరలివెళ్లారు.


