దళారులకు ధాన్యం విక్రయించొద్దు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి/వేములవాడరూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. రుద్రంగిలో ప్యాక్స్ మొక్కజొన్న, డీసీఎంఎస్ వరి ధాన్యం, వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్, మాజీ జెడ్పీటీసీలు గట్ల మీనయ్య, పొద్దుపొడుపు లింగారెడ్డి, పిడుగు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్ల/ముస్తాబాద్: జిల్లాలోని జ్వరపీడితులకు రక్తపరీక్షలు చేసి, మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమీక్షించారు. రజిత మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది పర్యటించాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. గర్భిణీల వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రికి సాధారణ ప్రసవాల కోసం వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారులు వైద్యులు అంజలి, సంపత్కుమార్, రామకృష్ణ, అనిత, నహిమా జహా పాల్గొన్నారు.
టీబీ ముక్త్భారత్ అందరి లక్ష్యం
క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి అందరూ పనిచేయాలని డీఎంహెచ్వో రజిత, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ చింతోజు శంకర్ కోరారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ పీహెచ్సీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 60 మందికి ఫుడ్బాస్కెట్లు అందజేశారు. వైద్యులు హఫీజా, అనిత, సంపత్, రామకృష్ణ, టీబీ యూనిట్ సూపర్వైజర్ మహిపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): పచ్చివడ్లు కొంటామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. తీర అమ్మినాక పలు రకాలుగా కోతలు పెడుతున్నాడని పలువురు రైతులు మండల కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు. ముస్తాబాద్కు చెందిన కుంబాల రాజిరెడ్డి, తెర్లుమద్దికి చెందిన బైతి మల్లేశం, వెంకయ్యకుంటకు చెందిన కంకణాల రాజు విలేకరులతో మాట్లాడారు. బందనకల్కు చెందిన రైస్మిల్లు నిర్వాహకులు పచ్చివడ్లు కొంటామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తాము వడ్లు అమ్మినట్లు తెలిపారు. తమకు ఇచ్చిన రశీదుల్లో క్యాష్, గుమస్తా కటింగ్, 70 కిలోల సంచికి కిలో ధాన్యం కటింగ్ అంటూ కోతలు పెడుతూ రశీదులు ఇచ్చారని తెలిపారు. ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి 10వేలు నష్టం కల్గిస్తున్నారని ఆరోపించారు. 84 క్వింటాళ్లు విక్రయించిన తనకు రూ.10వేలు నష్టం జరిగిందని రాజి రెడ్డి, 90 క్వింటాళ్లు అమ్మిన తనకు రూ.12వేలు నష్టం జరిగిందని మల్లేశం తెలిపారు.
కోనరావుపేట(వేములవాడ): తమ గ్రామం నుంచి ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని కొండాపూర్ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కొండాపూర్ పరిధిలోని మూలవాగు నుంచి ఇసుక రవాణా కొనసాగుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని, గ్రామానికి నీటి సరఫరా చేసే తాగునీటి బావి అడుగంటిపోతుందని గ్రామ స్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర గ్రామాలకు ఇక్కడి నుంచి ఇసుకకు అనుమతి ఇవ్వవద్దని కోరారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి శాంతింపజేశారు.
దళారులకు ధాన్యం విక్రయించొద్దు
దళారులకు ధాన్యం విక్రయించొద్దు


