
ముందుంది ముప్పు
చెరువుల వివరాలు
కనువిప్పు కలిగేదెప్పుడో..
కామారెడ్డి సంఘటనతోనైనా తేరుకుంటారా..
కబ్జా కోరల్లో సిరిసిల్ల నాలాలు
చెరువులను వదలని ఉల్లం‘ఘనులు’
పట్టింపులేని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు
ఈ ఫొటోలు సిరిసిల్ల కొత్తచెరువు మత్తడికాల్వకు పురాతన, ప్రస్తుతానికి సంబంధించినవి. ఒకప్పుడు ఇక్కడ నాలా ఆనవాళ్లు కనిపిస్తుండగా.. దాని ద్వారా నీళ్లు కిందికి వెళ్లేందుకు రూ.50లక్షలతో కల్వర్టును దశాబ్దం క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇది కబ్జాకు గురైంది. ఇక్కడి స్థలాలు కోట్ల విలువ పలుకుతుండడంతో మాజీ ప్రజాప్రతినిధులు, రియల్టర్లు కలిసి కాలువ భూమిని కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తచెరువు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మానేరునదిలో కలిసే మత్తడినీటి కాలువ ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయింది.
మీరు చూస్తున్నది రాయించెరువు పురాతన మత్తడి కాలువకు సంబంధించిన పురాతన, ప్రస్తుత చిత్రాలు. ఇప్పుడు చెరువు లేదు. సర్కారు పట్టాలు చేసి కార్మికులకు అందించింది. లోతట్టు ప్రాంతం కాబట్టి వరదనీరు పోవడానికి కాలువను అలాగే వదిలేయగా.. ఇప్పుడు ఇలా కబ్జాకు గురైంది. ఇది చెరువు నుంచి గోపాల్నగర్ మీదుగా రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించి మానేరువాగులో కలిసేది. కాల్వ ఆనవాళ్లు లేకుండా చేసి ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. సంబంధిత శాఖల అధికారులకు తెలిసి కూడా కాల్వస్థలాన్ని ఆధీనంలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిరిసిల్లటౌన్: నాలాల కబ్జాలు.. కాల్వల మాయంతో ఇటీవల కామారెడ్డి పట్టణం వరదలతో ముంచెత్తింది. కబ్జాలపర్వాన్ని అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతోనే ఇలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. గతంలోనూ సిరిసిల్ల పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కాల్వల కబ్జాలను తొలగిస్తామన్న అధికారులు అనంతరం చూసీచూడనట్లుగానే ఉంటున్నారు. ఇప్పటికై నా కబ్జాలను కన్నెర్ర చేస్తేనే రానున్న కాలంలో ఎంతటి వరదనైనా తట్టుకునే శక్తి సిరిసిల్లకు ఉంటుంది. లేకుంటే వరదల్లో చిక్కుకునే ప్రమాదాలు ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని చెరువుల కాల్వలు ఏళ్లుగా దురాక్రమణకు గురైన తీరుపై గ్రౌండ్ రిపోర్ట్.
పట్టణ విస్తరణతో..
సిరిసిల్ల పట్టణం విస్తరించడంతో శివారులోని చెరువులు పట్టణంలో అంతర్భాగమయ్యాయి. ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయించెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం ఏర్పడింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకు సైతం వరదనీరు పోటెత్తుతుంది. ఎగువప్రాంతం నుంచి వచ్చే వరదనీరు కిందికి వెళ్లేందుకు కాల్వలు లేక ముంపునకు గురువుతున్నాయి. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట స్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని కొత్తచెరువు, కార్గిల్లేక్ కాల్వలు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ లెవెల్ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇటీవల చెరువులు, కాల్వ లకు ముప్పై ఫీట్ల దూరంలోపే నిర్మాణాలు జరుగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువు సర్వేనంబర్ విస్తీర్ణం(ఎకరాల్లో) కాలువ(కి.మీ)
కొత్తచెరువు 1471 85.05 4
రాయించెరువు 703 152.10 3
ఈదులచెరువు 991 77.29 1.5
అర్జునకుంట 757 22.36 1
దేవునికుంట 1121 9.28 1.5
మైసమ్మకుంట 1294 11.02 1
దామెరకుంట 232,233 7.38 2
తుమ్మలకుంట 142,143 29.23 2
వర్ధనికుంట – – –
చినుకొస్తే మునకేనా..
పూర్వీకులు వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం సిరిసిల్ల చుట్టూ తొమ్మిది చెరువులను గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించారు. ఇందులో రాయించెరువు, తుమ్మలకుంటలు నివాస స్థలాలుగా మారడంతో వాటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.
కొత్తచెరువు, కార్గిల్లేక్లు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖల ఆధీనంలో ఉన్నాయి. అర్జునకుంట, ఈదులచెరువు, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్నాయి.
కొత్తచెరువు, కార్గిల్లేక్ స్థలాలు, మత్తడి కాల్వలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులే చెబుతున్నా చర్యలు చేపట్టడం లేదు.
సిరిసిల్ల ఎగువ ప్రాంతంలోని బోనాల తదితర చెరువుల కట్టలు భారీ వర్షాలకు తెగిపోయి నీరు పట్టణంలోకి వస్తుంది. ఈ సమయంలోనే అన్ని చెరువుకట్టలను పటిష్ట పర్చడంపై అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
నాడు
నేడు

ముందుంది ముప్పు

ముందుంది ముప్పు

ముందుంది ముప్పు

ముందుంది ముప్పు

ముందుంది ముప్పు