
వాగుదాటని పల్లెలు
రోడ్ల వివరాలు
తెగిన బంధాలు
జిల్లాలో 28 రోడ్లు ధ్వంసం
నిలిచిన రాకపోకలు
కష్టాలతో ప్ర‘జల’ ప్రయాణం
వీడని ముసురు వర్షం
ఇంటికిపోవడం ఇబ్బందిగా ఉంది
చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట–వెంకట్రావుపేట రోడ్డు. ఇక్కడ మూలవాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు ఉండగా.. వరదలో కొట్టుకుపోయింది. గతంలో లోలెవల్ వంతెన నిర్మించగా రెండుసార్లు కోతకు గురైంది. హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా టెండర్ల దశలో ఉంది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మండలంలోని వట్టిమల్ల–నిమ్మపల్లి మధ్య మూలవాగుపై తాత్కాలిక రోడ్డు వరద పాలైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాలు..వరదలతో జిల్లాలోని కొన్ని పల్లెలు వాగులు దాటడం లేదు. వరద ఉధృతి కొనసాగుతుండగా రాకపోకలు లేక బిక్కుబిక్కుమంటున్నాయి. కనుచూపు మేరలో ఊరు కనిపిస్తున్నా వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. జిల్లాలో వర్షాలు.. వరదలతో పల్లెల్లోని రోడ్డు రవాణా వ్యవస్థ అస్థవ్యస్తమైంది. వరద ఉప్పొంగుతుండడంతో రోడ్లు తెగిపోయాయి. ప్రజాజీవనం స్తంభించింది. మండల కేంద్రాల నుంచి పల్లెలకు వెళ్లే రహదారులు కోతలకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,636 రోడ్లు ఉండగా 28 రహదారులు వరద ప్రవాహంతో తెగిపోయాయి. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మండలాల్లో ఎక్కువగా పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోయాయి.
ప్రయాణం నరకం
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం మధ్య మానేరువాగుపై వంతెన వద్ద రోడ్డు రోడ్డు కోతకు గురైంది. పదిర, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణుపల్లి మధ్య మానేరు పొంగి పొర్లుతుండడంతో సిద్దిపేట, ముస్తాబాద్, దుబ్బాక ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. కోరుట్లపేట, అక్కపల్లి శివారులో రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు రద్దు చేశారు. ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలంలో నాలుగు మార్గాలలో దాదాపు ఐదు రోడ్లు వరదకు కొట్టుకుపోవడంతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పట్టించుకోని అధికారులు
జిల్లాలో 28 రోడ్లు తెగిపోయినా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు రోడ్ల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. తండాలు, పల్లెల మధ్య తెగిపోయిన రోడ్లను గ్రామపంచాయతీ నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం విశేషం.
పంచాయతీరాజ్ రోడ్లు 1,041
ఆర్అండ్బీ రోడ్లు 595
తెగిన ఆర్అండ్బీ రోడ్లు 06
తెగిన పీఆర్ రోడ్లు 22
బండలింగంపల్లి మానేరువాగుపై ఉన్న వంతెన దగ్గర రోడ్డు కోతకు గురికావడంతో మా ఊరికి పోవడం కష్టంగా మారింది. వివిధ పనులరీత్య మండల కేంద్రానికి వచ్చి తిరిగి ఇంటికెళ్లడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, నాయకులు స్పందించి తెగిన రోడ్డును మరమ్మతు చేయాలి.
– గొరిటిపల్లి జితేందర్, బండలింగంపల్లి
ఎల్లారెడ్డిపేట మండలం పదిర– రామలక్ష్మణులపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన తెగిపోవడంతో వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ మండలానికి వెళ్లాల్సి వస్తోంది. ఏటా ఈ తాత్కలిక వంతెన తెగిపోవడం పరిపాటిగా మారింది. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి. – చల్ల సత్యంరెడ్డి, పదిర

వాగుదాటని పల్లెలు

వాగుదాటని పల్లెలు

వాగుదాటని పల్లెలు