డిగ్రీ కాలేజీ పిలుస్తోంది
● అగ్రహారం ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు ● అనుభవజ్ఞులైన అధ్యాపకులు ● పరిశోధనల్లో రాణిస్తున్న విద్యార్థులు ● కొనసాగుతున్న రెండో విడత దోస్త్ ప్రవేశాలు ● ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యం
సిరిసిల్లకల్చరల్: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ దోస్త్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. తొలి విడత పూర్తి కాగా రెండో దశ రిజిస్ట్రేషన్లు గత నెల 30 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో అగ్రహారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తన సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు ఆలంబనగా నిలుస్తోంది. 38 ఏళ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూనే కార్మిక, ధార్మిక క్షేత్రాల్లో విద్యాపరిమళాలు వెదజల్లుతోంది.
కోర్సులు ఇవీ..
బీఏ, బీకామ్ కోర్సులతో 1987లో మొదలైన కళాశాలలో ప్రస్తుతం వీటితోపాటు బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సులు, బీఎస్సీ బీజెడ్సీఎస్ ఉన్నాయి. గతేడాది బీఎస్సీ ఫుడ్సైన్స్ క్వాలిటీ కంట్రోల్, బీఏ హెచ్ఈపీ, హెచ్పీపీ, ఈపీపీ, హెచ్ఈసీఎస్ కోర్సులతోపాటు బ్యుటీషీయన్, కాస్మెటాలజీ అనే సర్టిఫికెట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యం
దూరప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వసతిగృహాన్ని మంజూరు చేసింది. రూ.10కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ, స్థల సేకరణ పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనంలో హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
ఏటా ఉద్యోగ మేళాలు
డిగ్రీ పట్టా ఇవ్వడంతో సరిపెట్టకుండా పట్టభద్రులై న విద్యార్థులకు ఉపాధిమార్గాల అన్వేషణలోనూ కళాశాల దోహదం చేస్తోంది. ఏటా ఉద్యోగమేళాలు నిర్వహిస్తూ యువతకు ప్లేస్మెంట్ సౌకర్యాలను చేరువ చేస్తోంది. కోర్సుల అధ్యయనంతోపాటు ఉద్యోగ సాధనకు అవసరమైన స్కిల్స్ నేర్పించే ప్ర క్రియపై శ్రద్ధ పెడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం సులువు అవుతోంది.
ప్రైవేట్ వలలో పడొద్దు
ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలతోపాటు నిష్టగా పనిచేసే ఉన్నత విద్యార్హతలు గల అధ్యాపకులు ఉన్నారు. ప్రైవేట్ వలలో పడకుండా దోస్త్ రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటే ప్రభుత్వపరమైన అన్ని సౌకర్యాలు, నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు సామాజిక విజయాలను సొంతం చేసుకోవచ్చు.
– డాక్టర్ టి.శంకర్, ప్రిన్సిపాల్
దోస్త్ షెడ్యూల్ ఇలా...
రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
మే 30 నుంచి జూన్ 8 వరకు
వెబ్ ఆప్షన్స్ : జూన్ 9 వరకు
సీట్ల కేటాయింపు : జూన్ 13
సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 19
మూడో విడత
జూన్ 13 నుంచి 19 వరకు
సీట్ల కేటాయింపు : జూన్ 23
సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 28
కళాశాలలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ : జూన్ 24 నుంచి 28
తరగతులు : జూన్ 30
డిగ్రీ కాలేజీ పిలుస్తోంది


