
కుట్టేస్తున్నారు
● విద్యార్థుల యూనిఫాంలు సిద్ధం చేస్తున్న మహిళలు ● విద్యాసంవత్సరం ఆరంభంలోగా అందించాలని లక్ష్యం ● వేగంగా సిద్ధమవుతున్న దుస్తులు
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు యూనిఫాంలు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఈమేరకు యూనిఫాంల కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పజెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించారు. గత ఫిబ్రవరిలోనే వీవోఏలు, ప్రధానోనాపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలను సేకరించారు. ప్రస్తుతం తరగతులవారీగా రూపొందించిన డిజైన్లు, కొలతల ప్రకారం దుస్తులను కుడుతున్నారు. మరోవైపు కుట్టుమిషన్ పని వచ్చే మహిళా సంఘాల సభ్యులు ఉపాధి పొందుతున్నారు. వీరికి ఒక్కో జత కుట్టినందుకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు.
ముందుగా ఒక్కో జత
జిల్లా వ్యాప్తంగా 32,269 మందికి యూనిఫామ్స్ అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 20వేలకు పైగా యూనిఫామ్స్ దుస్తులు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా జూన్ 12లోపు సిద్ధం చేస్తామని స్వయం సహాయక సంఘాల సభ్యులు చెబుతున్నారు. ముందుగా ఒక్కొక్కరికి ఒక్కో జత ఇవ్వనున్నారు.
ఆర్థికాభివృద్ధికి దోహదం
విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళలకు అప్పగించడం ద్వారా మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి దోహదం కానుంది. ఏటా ఇదే విధంగా మహిళలకు పనులు అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. యూనిఫాంలు కుట్టే పనితో మహిళలకు ఉపాధి లభిస్తుంది.
– భాగ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు, గంభీరావుపేట
గడువులోగా అందిస్తాం
అధికారులు చెప్పినట్లుగా విద్యాసంవత్సరం ఆరంభంలోగా పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలు యూనిఫాంలు కుట్టే పనిని వేగంగా చేస్తున్నారు.
– సుదర్శన్, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట

కుట్టేస్తున్నారు

కుట్టేస్తున్నారు