
కులగణన ప్రకటనపై హర్షం
సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని కులస్తులు స్వాగతిస్తున్నారన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి గజభీంకార్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేశ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీపై మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు
● జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య
సిరిసిల్ల: జిల్లాలో ‘ఇందిరా మహిళా శక్తి’
పథకంలో భాగంగా రెండు స్వయం సహాయక సంఘాల మహిళలకు 60 శాతం సబ్సిడీపై మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు మంజూరయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య గురువారం తెలిపారు. నీలి విప్లవం 2018–19 పథకంలో భాగంగా జిల్లాలో 40 శాతం లబ్ధిదారులు వాటాధనం చెల్లించాల్సి ఉందని వివరించారు. ఆసక్తి గల మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సౌజన్య తెలిపారు. మే 2 నుంచి 9లోగా కలెక్టరేట్లోని మత్స్యశాఖ ఆఫీస్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 40 శాతం వాటాధనం చెల్లించే ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు దరఖాస్తు చేయాలని, 60 శాతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని వివరించారు. వివరాలకు 94916 51263లో సంప్రదించాలని కోరారు.