
రసాభాసగా రాజన్నపేట ఇళ్ల విచారణ
● పరిహారం ఇవ్వాలని పలువురి వాదన ● మరోసారి వాయిదా
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై గతంలో వచ్చిన ఆరోపణలపై గురువారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ రసాభాసగా మారింది. ఈనెల 20న విచారణకు ఎవరూ హాజరుకాకపోవడంతో వాయిదాపడ్డ విషయం తెలిసిందే. గురువారం నాటి విచారణకు గ్రామానికి చెందిన పలువురు హాజరై తమ ఇళ్లకు పరిహారం రాలేదన్నారు. తమకు సైతం పరిహారం ఇవ్వాలని కోరారు. గతంలో పరిహారం తీసుకున్న వారికి మళ్లీ ఇస్తే తమకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న 9 మంది న్యాయవాదితో వచ్చారని డీఎల్పీవో నరేశ్ తెలిపారు. 2005 నుంచి గ్రామపంచాయతీ రికార్డులు సక్రమంగా లేవన్నారు. రికార్డులు సరిగ్గా తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశం రసాభాసగా మారడంతో వాయిదా వేస్తున్నట్లు డీఎల్పీవో ప్రకటించారు. సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్రావు, గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహిత హాజరయ్యారు.