‘చెన్నమనేని’ పేరు ఇక శాశ్వతం! | Sakshi
Sakshi News home page

‘చెన్నమనేని’ పేరు ఇక శాశ్వతం!

Published Thu, Aug 31 2023 12:16 AM

మల్కపేట జలాశయంలోకి ఎత్తిపోస్తున్న పంపు(ఫైల్‌) - Sakshi

● కాళేశ్వరం 9వ ప్యాకేజీకి రాజేశ్వర్‌రావు పేరు ● ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ● నేడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు శతజయంతి

సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీకి ‘చెన్నమనేని రాజేశ్వర్‌రావు’ పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఆరుసార్లు విజయం సాధించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడ ు, ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందిన స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర్‌రావు శతజయంతి( ఆగస్ట్‌ 31న) సందర్భంగా 9వ ప్యాకేజీకి ఆయన పేరును ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యమానేరు నుంచి గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వరకు 9వ ప్యాకేజీ లో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌, కాల్వలు, ఇత ర అన్ని నిర్మాణాలకు ‘చెన్నమనేని రాజేశ్వర్‌రావు’ పేరును ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. రాజేశ్వర్‌రావు తనయుడు చెన్నమనేని రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా 2009నుంచి నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీకి రాజేశ్వర్‌రావు పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే మధ్యమానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను రెండు పంపు ల ద్వారా ఎత్తిపోశారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మల్కపేట రిజర్వాయర్‌ను ప్రారంభించా లని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 9వ ప్యాకేజీ పనులకు ‘చెన్నమనేని’ నామకరణం చేయడం విశేషం.

ఉద్యమాల యోధుడికి ప్రత్యేక గుర్తింపు

కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1923 ఆగస్ట్‌ 31న జన్మించారు. 2016 మే 9న హైదరాబాద్‌లో అనారోగ్యంతో మరణించారు. 1957లో తొలిసారిగా చొప్పదండి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు నిజాం వ్యతిరేకపోరాటంలో, తెలంగాణ విముక్తి ఉద్యమంలో మడమ తిప్పని పోరాటం సాగించారు. 1967, 1978, 1985 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో రైతు సంఘం జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేస్తూ అసెంబ్లీలో ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు సీపీఐకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

సేవ్స్‌ ద్వారా నీటి పథకాలు

రాజేశ్వర్‌రావు తన తనయుడు రమేశ్‌బాబు ద్వారా జర్మనీ స్వచ్చంద సంస్థ ద్వారా నిధులు సమకూర్చి సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో ‘సేవ్స్‌’ అనే స్వచ్చంధ సంస్థ ద్వారా నీటి పథకాలను, వాటర్‌షెడ్‌ పనులను చేశారు. సామాజిక సేవలో ముందున్న రాజేశ్వర్‌రావు మెట్ట ప్రాంతానికి సాగు నీరు సాధించేందుకు ఎత్తిపోతల పథకం తప్ప మరో మార్గం లేదని పదేపదే చెప్పే వారు. ఆయన ఆశయాలను నిజం చేస్తూ.. సిరిసిల్ల, వేములవాడ మెట్ట ప్రాంతానికి సీఎం కేసీఆర్‌ గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాధించారు. రాజేశ్వర్‌రావు కలలు నిజమయ్యాయి.

సీహెచ్‌.రాజేశ్వర్‌రావు(ఫైల్‌)
1/1

సీహెచ్‌.రాజేశ్వర్‌రావు(ఫైల్‌)

Advertisement
Advertisement