బొత్సపై బాడీ షేమింగ్ దారుణం
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం టౌన్: శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై బాడీ షేమింగ్ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్త కిరాక్ ఆర్పీపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు హుందాతనంగా ఉండాలి కానీ, ఒకరిని ఎగతాళి చేసేలా ఉండకూడదని అన్నారు. ఒక సీనియర్ నేత గొంతును ఎగతాళి చేస్తూ వ్యక్తిగత హననం చేయడం సరికాదని జంకె పేర్కొన్నారు.
ఒంగోలు టౌన్: దేశ రైతాంగానికి చేటు చేసేలా అమెరికాతో ఒప్పందం చేసుకోవడం దారుణమని, దేశ ప్రయోజనాలను కార్పొరేట్ శక్తులకు, విదేశాలకు కట్టబెట్టేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన చేస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి ఆరోపించారు. సుందరయ్య భవనంలో సోమవారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రమాదేవి మాట్లాడుతూ దేశ రైతులను ప్రధాని మోదీ వంచించారని ధ్వజమెత్తారు. భారత వ్యవసాయ పరిశ్రమలపై పరాయి దేశాల పెత్తనం కొనసాగించడానికి అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో పంటల కనీస మద్దతు ధరల కోసం విదేశాలపై ఆధారపడే దుస్థితి దాపురిస్తోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ద హామీ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ, వ్యవసాయానికి రక్షణాత్మక విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు రహదారి అభివృద్ధి వంటి కీలక రంగాలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సమావేశంలో సయ్యద్ హనీఫ్, జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, డి.సోమయ్య పాల్గొన్నారు.


