కనిపించకుండా వణికిస్తోంది..
జిల్లాలో చాపకింద నీరులా ప్రబలుతున్న స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పటికే ఇద్దరు మృతి, మరో ఆరుగురికి పాజిటివ్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 19 పాజిటివ్ కేసులు జ్వరం వచ్చిందంటే చాలు.. భయంతో వణికిపోతున్న జనాలు ఆందోళన అవసరం లేదంటున్న వైద్యులు ఆర్ఎంపీల వద్దకు వెళ్లవద్దని సూచిస్తున్న వైద్య నిపుణులు
స్క్రబ్ టైఫస్.. ఈ పేరు జిల్లా
వాసులను వణికిస్తోంది.
ఈ మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాత పడగా, మరికొందరు ఒంగోలు, గుంటూరు జీజీహెచ్లలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తోంది. అదీ పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ ప్రభావం చూపుతోంది.
పొలాలకు వెళ్లే మహిళలలో ఈ తరహా జ్వరాలు కనిపిస్తుండటంతో గ్రామీణ మహిళలు పొలాలకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. జ్వరం వస్తేనే బెంబేలెత్తుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో జ్వర
బాధితులు సకాలంలో చికిత్స
చేయించుకోక ప్రాణాల మీదకు
తెచ్చుకుంటున్నారు.
ఒంగోలు టౌన్:
వరుస మరణాలతో జిల్లాలో కలకలం...
స్క్రబ్ టైఫస్తో వరుస మరణాలు సంభవించడంతో జిల్లాలో కలకలం రేగింది. జిల్లాలో ఇద్దరు మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యర్రగొండపాలెం గ్రామంలోని ఇజ్రాయిల్పేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు పరిమళ దానమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున మృతి చెందింది. గత నెల 16వ తేదీ జ్వరం, నీళ్ల విరేచనాలు, నీరసంతో ఆమె బాధపడుతూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందింది. అక్కడ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి పంపించారు. 18 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే సంతనూతలపాడు మండంలోని రుద్రవరం గ్రామానికి చెందిన కోయ నాగేంద్రమ్మ అనే 51 ఏళ్ల వృద్ధురాలు కూడా స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ మరణించింది. జ్వరం బారిన పడిన నాగేంద్రమ్మకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీ మరణించింది.
మరో ఆరుగురికి పాజిటివ్...
కొనకనమిట్ల మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన మరో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ సోకింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారించారు. వెంటనే ఒంగోలు జీజీహెచ్కి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే, స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ ఒంగోలు జీజీహెచ్కి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి గురువారం వరకు ఐదుగురు స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ జీజీహెచ్లో చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు. 9వ తేదీ ఒక్కరోజే జీజీహెచ్కి ముగ్గురు వచ్చారు. 10వ తేదీ ఒకరు, 11వ తేదీ మరొకరు చేరినట్టు సమాచారం. అంతేగాకుండా ప్రైవేటు ఆస్పత్రి నుంచి మరొక కేసు కూడా జీజీహెచ్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ మూడు రోజుల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదై జీజీహెచ్లో చేరారు. బాధితుల్లో ఒంగోలు నగరంతో పాటు పొదిలి, కందుకూరు, మార్కాపురం, కంభాలపాడు గ్రామాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒకటీరెండు రోజుల్లో వీరిని డిశ్చార్జి చేస్తామని జీజీహెచ్ వైద్యులు తెలిపారు.
భయాందోళన అవసరం లేదు
స్క్రబ్ టైఫస్ ప్రమాదకరం కాదు. డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్తో నయమవుతుంది. నిజానికి ఇది గత రెండుమూడేళ్లుగా కనిపిస్తోంది. మన జిల్లాలో 2024లో 31 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వ్యాధి సోకిన తర్వాత ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. – డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి
భయం వద్దు..
సకాలంలో చికిత్స అవసరం...
స్క్రబ్ టైఫస్ అనేది వైరస్ కాదు. అంటే ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రాణాపాయం కూడా కాదు. ఇది సాధారణమైన జ్వరం మాత్రమేని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్క్రబ్ టైఫస్ సోకి చనిపోయిన వారంతా 60 ఏళ్ల వయసు కలిగిన వారు కావడాన్ని గమనించాలని చెబుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు స్క్రబ్ టైఫస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. దీంతో విలువైన కాలం హరించుకుపోతుందని, వ్యాధిని నిర్ధారించే సరికి ప్రాణం పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కనిపించకుండా వణికిస్తోంది..


