సాగర్ కాలువలో యువకుడి మృతదేహం గుర్తింపు
కురిచేడు: త్రిపురాంతకం మండలం రాజుపాలెం సాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన పెద్దపూడి సురేంద్రరెడ్డి (20) మృతదేహం శుక్రవారం మండలంలోని నాయుడుపాలెం సాగర్ కాల్వలో లభ్యమైంది. సురేంద్రరెడ్డి గుంటూరులో బీటెక్ చదువుతూ బంధువుల ఇంట్లో అయ్యప్పస్వామి ఇరుముడి కార్యక్రమానికి స్వగ్రామం వచ్చాడు. గురువారం ఉదయం కాలువకు వచ్చి జారిపడి కనిపించక పోవడంతో సురేంద్రరెడ్డి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. కాలువ కట్టపై ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో సురేంద్రరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం మండలంలోని పడమరనాయుడుపాలెం వద్ద నాగార్జునసాగర్ కాలువలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సురేంద్రరెడ్డి తండ్రి సుబ్బారెడ్డికి అప్పగించారు.
గిద్దలూరు రూరల్: మండలంలోని వెల్లుపల్లెలో ఓ వ్యక్తి బైక్కు దుండగులు నిప్పు అంటించిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో జంగాల రవికి చెందిన ఫ్యాషన్ ప్రో బైక్ను ఇంటి ముందు ఉంచి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్ను అక్కడి నుంచి గ్రామానికి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు అంటించారు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబుదాబి – దుబాయి ప్రాంతాలలో హోంకేర్ నర్స్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోంకేర్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు. కనీసం 2 సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా ఇంగ్లిష్ భాష వచ్చి ఉండాలన్నారు. జీతం నెలకు 1,08,900 నుంచి 2,00,000 రూపాయలు ఉంటుందన్నారు. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధి ఉంటుందన్నారు. రోజుకు 10 గంటలు లేదా వారంలో 6 రోజులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సంవత్సరానికి 20 రోజులు సెలవులు ఉంటాయన్నారు. పన్ను రహిత జీతం ఉంటుందని, ఉచిత భోజనం, వసతి, వైద్యం, రవాణా ఉంటుందన్నారు. వీసా, విమాన ప్రయాణ ఖర్చులు కంపెనీ భరిస్తుందన్నారు. అభ్యర్థులు సర్వీస్ చార్జీల కింద 1,75,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు పాస్పోర్ట్, అనుభవ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈఅఏ, ఈఏఅ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఉలవపాడు: గుడ్లూరు మండలంలో భూసేకరణ సమావేశానికి సీపీఎం నాయకులు వస్తారని పోలీసులు శుక్రవారం ముందస్తుగా వారిని అరెస్టు చేసి ఉలవపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. కందుకూరులో ఉంటున్న సీపీఎం నాయకులు జీవీబీ కుమార్, గౌస్ను అరెస్టు చేసి ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. గ్రామ సభకు వెళ్తున్న సీపీఎం గుడ్లూరు మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లును చేవూరు వద్ద అరెస్టు చేసి ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. చేవూరు గ్రామానికి చెందిన ఇరువూరి ఉపేంద్రబాబు, గోచిపాతల జక్రయ్య, రావూరుకు చెందిన కాకు మల్లికార్జున, మిరియం వెంకట్రావులను అర్ధరాత్రి అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. సాయంత్రం 3 గంటలకు సమావేశం పూర్తయిన తర్వాత వారిని పంపించారు. ప్రజాభిప్రాయసేకరణ అని చెప్పి అరెస్టులు చేయడం దారుణమని వారు బయటకు వచ్చిన తర్వాత ఖండించారు. పచ్చని భూములను కార్పొరేటుకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
సాగర్ కాలువలో యువకుడి మృతదేహం గుర్తింపు
సాగర్ కాలువలో యువకుడి మృతదేహం గుర్తింపు
సాగర్ కాలువలో యువకుడి మృతదేహం గుర్తింపు


