
కూటమి పాలనలో అభివృద్ధి తిరోగమనం
మార్కాపురం/పొదిలి రూరల్: ప్రజల దాహార్తిని తీర్చేందుకు, విద్యాభివృద్ధికి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. గురువారం ఆమె మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటెక్ వెల్, రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో అభివృద్ధి పనులను గాలికొదిలేసిన తీరును ఎండగట్టారు. పశ్చిమ ప్రకాశం వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.75 కోట్లతో ఇన్టెక్ వెల్ నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా జల్ జీవన్ మిషన్ కింద రూ.1270 కోట్లు ఖర్చు చేసే పథకానికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఎన్నికల్ కోడ్ అమలయ్యే నాటికి ఇంటెక్ పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మార్కాపురంలో జల్జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేస్తూ తామే నిధులు తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పడాన్ని తప్పుబట్టారు. వెలిగొండ ప్రాజెక్టును 2004లో జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ టన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.
ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్వహించాలి
మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 70 శాతానికిపైగా పూర్తి కాగా కూటమి అధికారం చేపట్టగానే నిలిపేయడంపై శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య, నాణ్యమైన వైద్యం అందరికీ అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం భావించడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీ పనులను వేగంగా పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ బాటలోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్ నడుస్తున్నారని, వారు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. అనంతరం ఆమె పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబును కలిసి మాట్లాడారు.
చెరువా.. డంపింగ్ యార్డా?
పొదిలి పెద్ద చెరువు పైప్లైన్ పనులను శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 12వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పెద్ద చెరువు పైపులైన్ పనులను ప్రారంభించారన్నారు. రూ.50.13 కోట్ల వ్యయంతో దర్శి ఎన్ఎస్పీ కాలువ నుంచి పెద్దచెరువుకు సాగర్ నీరు సరఫరా చేసేందుకు భూగర్బ పైపు లైన్ పనులను కూటమి ఏడాదిపాటు నిలిపేయడంతో డంపింగ్ యార్డులా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నంచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను తొలగించినంత మాత్రానా చేసిన మంచిని ప్రజల మది నుంచి చెరిపేయలేరని కూటమి నాయకులకు చురకలంటించారు. అబద్ధాలు చెప్పడం మానుకుని ప్రజలకు అవసరమైన మంచి పనులు చేయాలని హితవు పలికారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జిశ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మస్తాన్వలి, గుంటూరి పిచ్చారెడ్డి, సింగారెడ్డి వెంకటేశ్వర్లు, అనుబంధ సంఘాల నాయకులు
మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు
నిలిపేయడం దుర్మార్గం
జల్జీవన్ మిషన్ పనుల మంజూరుపై
పవన్కల్యాణ్ డబ్బా
పొదిలి చెరువును డంపింగ్ యార్డుగా
మార్చిన ఘటన కూటమి సర్కారుదే..
ప్రజల హృదయాల్లో వైఎస్సార్ కుటుంబానికి సుస్థిర స్థానం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల