
ఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్
కంభం: ఇంజక్షన్ వికటించి ఓ విద్యార్థికి ఇన్ఫెక్షన్ సోకిన ఘటన కంభం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వారం రోజుల క్రితం వేసిన ఇంజక్షన్ వికటించి అనారోగ్యానికి గురైన విద్యార్థిని గురువారం కంభం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని పూసలబజారులో నివాసం ఉంటున్న కె.సతీష్ కుమార్ బీసీ హాస్టల్లో ఉంటూ కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన సతీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయులకు చెప్పడంతో హాస్టల్కు పంపించేశారు. ఆ తర్వాత హాస్టల్లో చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. కుమారుడి కుడిచేతి మణికట్టు వద్ద రంధ్రం లాగా ఉండి నల్లగా మారడాన్ని గమనించిన తల్లి.. గురువారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లింది. ఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పిన వైద్యులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. శ్రీవారం రోజుల క్రితం తనకు నీరసంగా ఉందని తరగతి గదిలో పడుకోగా పదో తరగతి ఏ సెక్షన్ విద్యార్థి నితీష్ వచ్చి ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుందని తీసుకెళ్లాడు. చర్చి సమీపంలో ఉన్న క్లినిక్ వద్ద ఇంజక్షన్ వేశాడుశ్రీ అని సతీష్ వివరించాడు. విషయం తెలుసుకున్న కంభం ఎస్సై నరసింహారావు వైద్యశాలకు చేరుకుని బాలుడి వద్ద వివరాలు సేకరించారు. పాఠశాలకు వెళ్లి నితీష్ను విచారించగా తానే ఇంజక్షన్ వేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. చర్చి సమీపంలో ఉన్న తెలిసిన వారి క్లినిక్లో ఇంజక్షన్ తీసుకున్నట్లు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. నితీష్ ఖాళీ సమయంలో క్లినిక్ వద్దకు వెళ్లి కూర్చునేవాడని, నీరసంగా ఉందని చెప్పిన సతీష్కు డైక్లోఫెనాక్ ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతుందని ఊహించుకుని అలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, క్లినిక్ నుంచి ఓ బాలుడు ఇంజక్షన్ తీసుకెళ్తున్నా సదరు వైద్యశాల సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నీరసంగా ఉందన్న విద్యార్థికి డైక్లోఫెనాక్ ఇంజక్షన్ వేసిన స్నేహితుడు
వారం రోజుల క్రితం కంభంలో ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు

ఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్