
సర్పంచ్ను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: గుంటూరు జిల్లా పొన్నూరులో ఇటీవల టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మన్నవ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావును ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం పరామర్శించారు. గుంటూరులోని రమేష్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలా ఆదుకుంటారని, పార్టీ నాయకుల అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళి ఉన్నారు.
రొయ్య రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి
● రొయ్య రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్
ఒంగోలు సబర్బన్: రొయ్య రైతులకు యూనిట్కు రూ.1.50 విద్యుత్ ఇవ్వాలని రొయ్య రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఒంగోలు కర్నూల్ రోడ్డులోని రొయ్యల రైతుల సంఘం కార్యాలయంలో మంగళవారం రొయ్యల రైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాఽథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రొయ్యల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తగ్గిన సోయా ధరలకు అనుగుణంగా ఫీడ్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1800 మంది రొయ్యల రైతులు ఉంటే కేవలం 1000 మందికి మాత్రమే సబ్సిడీ అందుతుందన్నారు. మిగిలిన రైతులకు 10 ఎకరాలు ఉన్న కారణంగా, డీకేటీ భూముల్లో సాగు చేస్తున్న కారణంగా సబ్సిడీ విద్యుత్ అందడం లేదన్నారు. దీంతో రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు భారం పెరుగుతుందన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో అధికంగా వాడే సోయా ధరలు సగానికి సగం తగ్గాయని, కానీ ఫీడ్ ధరలు మాత్రం తగ్గించలేదన్నారు. గత నెలరోజుల కాలంలో బ్లాక్ టైగర్ రొయ్యలు ధరలను 40 కౌంట్, 30 కౌంట్లలో కేజీకి రూ.100 ధర తగ్గించారన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఓ. సుబ్బారెడి, సంఘం గౌరవ అధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, ఉపాధ్యక్షుడు శింగంనేని అంజిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.
రేపు విద్యుత్ అదాలత్
ఒంగోలు సబర్బన్: నగరంలోని సంతపేట విద్యుత్ భవన్లో ఈ నెల 17న విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఒంగోలు ఈఈ ఎం.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ భవన్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదాలత్ జరుగుతుతుందన్నారు. అదాలత్లో సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్. విక్టర్ ఇమ్మానియేల్, ఫారం సభ్యులు ఒంగోలు ఆపరేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కట్టా వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు పాల్గొంటారన్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాల విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అదాలత్లో నమోదు చేసుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
చట్టాలపై అవగాహన అవసరం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు: చట్టాలపై అవగాహన కల్పించడం ప్రతి న్యాయ విద్యార్థి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో న్యాయ కళాశాల విద్యార్థులతో మంగళవారం లీగల్ లిటరసీ క్లబ్ను ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యల పరిష్కారం అనే అంశానికి సంబంధించిన ఐదు పరిష్కార విభాగాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన అవసరమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల మధ్య వ్యాజ్యాలపై అవగాహన ఏవిధంగా కలిగించాలనే అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల కరస్పాండెంట్ సీహెచ్ రామకృష్ణారావు మాట్లాడుతూ లీగల్ లిటరసీ క్లబ్ తమ కళాశాలలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కె.నటరాజ్ కుమార్ పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారంతో వేధిస్తున్నారు
● ఎస్పీకి పామూరు వీఓఏ ఫిర్యాదు
ఒంగోలు టౌన్: డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బు దుర్వినియోగం చేసి పారిపోయినట్లు తనపై తప్పుడు ప్రచారం చేసి వేధిస్తున్నారని పామూరు మండలం వెలుగు వీఓఏ మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్కు పిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల మీడియాకు వివరాలు వెల్లడించారు. సీసీ విజయభాస్కర్రెడ్డి, ఏపీఎం విద్యాసాగర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే రూ.5 లక్షలు డిమాండ్ చేశారని, తనవద్ద అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.

సర్పంచ్ను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి

సర్పంచ్ను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి