
నాటోదయం!
ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యం...
జిల్లాలోని పల్లెలు, మారుమూల గిరిజన తండాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో సారా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. అధికార పార్టీ నేతల అండతో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. దీనిని నిరోధించాల్సిన అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊరూవాడా బెల్టు షాపులు వెలిశాయి. 24 గంటలూ మద్యం ఫుల్లుగా దొరుకుతోంది. ఒకవైపు అధికారికంగానే పీకల దాకా తాగిస్తూ మరో వైపుసారా రహిత జిల్లా అంటున్న అధికారులు, పాలకుల మాటలపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. నాలుగు నెలలైనా ఒక్కరికి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు.
సారా సరే.. మద్యం సంగతేంటి...
జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు 189 మందికి లైసెన్సులు మంజూరు చేసింది. దాదాపుగా ఈ మద్యం దుకాణాలన్నీ అధికార కూటమి నాయకులు, కార్యకర్తలే దక్కించుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఊరూరా బెల్టు షాపులు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో 2500 బెల్టుషాపులున్నట్లు అంచనా. ఒక మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 10 నుంచి 15 వరకూ బెల్టు దుకాణాలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మంచినీరు దొరకని గ్రామాలు అనేకం ఉన్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామం కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కూడా 20 శాతం అదనంగా మద్యం విక్రయాలు పెంచాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తోందంటే.. మరింత మందితో మద్యం తాగించమని చెబుతున్నట్లే కదా అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీతో మందుబాబులు ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చేత మద్యం తాగించి సంపద సృష్టిస్తున్నారని వాఖ్యానిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండగా, దానికి పోటీగా పట్టణ శివారు ప్రాంతాలు, పల్లెలు, గిరిజన తండాల్లో జోరుగా నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. అధికారికంగా ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసిన దుకాణాల కంటే అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులే ఎక్కువగా ఉన్నాయి. దాంతో గతేడాది కాలంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా మందుబాబులు ఎక్కువైపోయారు. ప్రభుత్వం కూడా మద్యం విక్రయాలను మరింత పెంచాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవైపు పీకలదాకా మద్యం తాగిస్తూనే నవోదయం 2.0 పేరుతో మరోవైపు నాటుసారా రహిత జిల్లా గురించి ప్రభుత్వం మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సారా నిషాలో పల్లెలు...
పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాలు సారా మత్తులో జోగుతున్నాయి. జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలు, తండాలు, గిరిజన గూడేల్లో విచ్చలవిడిగా సారా కాస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్లలో సారా రాజ్యమేలుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో అధికారులు కూడా అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. దాంతో ఎవరికి ఎంత కావాలంటే అంత సొంతంగా కాసుకుని విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా పాలుట్ల సమీపంలో ఉన్న తండాలకు, చెంచు గూడేలకు కూడా తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. అలాగే యర్రగొండపాలం మండలంలోని పెద్ద పీఆర్సీ తండా, చిన్న పీఆర్సీ తండా, పిల్లికుంట, నరజాముల తండాలలో సారా కాస్తున్నట్లు సమాచారం. పుల్లలచెరువు, దోర్నాల మండలాల్లో, గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలోనూ యథేచ్ఛగా సారా కాస్తున్నట్లు సమాచారం. అర్ధవీడు లోయలోని అచ్చంపేట, పాపినేనిపల్లి, బొల్లుపల్లి గ్రామాలతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో సారా తయారీ నిత్యకృత్యంగా మారినట్లు చెబుతున్నారు. కంభం మండలంలోని లింగాపురం ప్రాంతంలో కూడా సారా వాసన వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అర్ధవీడు లోయలో తయారు చేసిన సారాను కంభం, బేస్తవారిపేట మండలాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. దోర్నాల మండలంలోని నల్లగుంట్ల, పనుకుమడుగు, బన్నంబావి, చిలకచర్ల, తుమ్మలబయలు, ధీఎంసీ కాలసీలు నాటు సారా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. అయితే 8 మండలాలలో 35 గ్రామాలను సారా పీడిత గ్రామాలుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 165 లీటర్ల నాటుసారా, 6,480 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు, 270 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే దాడులు ఎంత మొక్కుబడిగా సాగుతున్నాయో అర్థమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నత్తనడకన నవోదయం...
నవోదయం 2.0ను ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభించారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన నవోదయం జిల్లాలో నత్తనడక నడుస్తోంది. నేటికి నాలుగు నెలలైనప్పటికీ సాధించిన ప్రగతి శూన్యమని ఆరోపణలు ఉన్నాయి. కేవలం 29 కేసులు మాత్రమే నమోదు చేయడం, 19 మందిని అరెస్టు చేయడం చూస్తే నవోదయం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇట్టే తెలిసిపోతోందని చెప్పవచ్చు. నాటు సారా మీద నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాటుసారా కంటే మద్యం మీదనే ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సారా కంటే మద్యం వ్యాపారుల నుంచి వచ్చే మామూళ్లే ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. దీంతోపాటు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సెప్టెంబర్ చివరినాటికి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అరకొర సిబ్బందితో ఇది సాధ్యమయ్యేపని కాదని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు.
పశ్చిమాన పల్లెలు, తండాల్లో సారా దందా మారుమూల ప్రాంతాల్లో జోరుగా తయారీ నామమాత్రంగా అధికారుల దాడులు 29 కేసులు, 19 మంది అరెస్టు ఇప్పటి వరకూ 165 లీటర్ల నాటుసారా, 6,480 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం నవోదయం 2.0లో ఒక్కరికీ దక్కని ప్రత్యామ్నాయ ఉపాధి కూటమి పాలనలో ఊరూరా మద్యం జిల్లాలో ఎటుచూసినా బెల్ట్ షాపులు పీకలదాకా తాగిస్తూ సారా రహిత జిల్లా అంటూ కథలు
నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్కరికీ ప్రత్యామ్నాయం చూపిన దాఖలాలు లేవు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా అరెస్టులు, బైండోవర్ల గురించి ఏకరువు పెట్టారేగానీ ఎంతమంది నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపారో చెప్పలేదు. దీంతో గ్రామాల్లో అనేక ఏళ్ల తరబడి నాటుసారా తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారు ఇప్పుడు కూడా అదేవృత్తి కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది మాత్రం బెల్టు షాపులు పెట్టుకుని మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే నాటుసారా తయారీ కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.