
మహిళా కార్మికులకు నైట్ డ్యూటీలొద్దు
ఒంగోలు టౌన్: మహిళా కార్మికులకు నైట్ డ్యూటీలు వేయడం దుర్మార్గమని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అయినా మహిళలకు నైట్ డ్యూటీలు వేయడమేమిటని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. పనిగంటల పెంపు, మహిళా కార్మికులకు నైట్ డ్యూటీల విధింపులకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంటెనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని వేళలను 10 గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అలాగే మహిళలకు నైట్డ్యూటీ వేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్మికులు, ప్రజలు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని 29 లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను నిర్వీర్యం చేయడం, యూనియన్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను డొంకదారిలో నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఇటీవల మహిళా వీఆర్వోలకు నైట్ డ్యూటీ వేస్తే పోరాడి రద్దు చేయించుకున్నారని, కార్మికులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆర్.మోహన్, ఎం.అయ్యపురెడ్డి, చీకటి శ్రీనివాసరావు, సీహెచ్ చిరంజీవి, జి.రమేష్, పి.కల్పన, టి.రాము, వి మోజెస్, పి.ఆంజనేయులు, సయ్యద్ మున్వర్ బాషా, పేరయ్య, డీకే రావు, హరిబాబు, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర్వులు రద్దుచేయాలని సీఐటీయూ ధర్నా