
నల్లబర్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది
మద్దిపాడు: జిల్లాలో రైతులు పండించిన నల్ల బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్తో కలిసి గుండ్లాపల్లి సమీపంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన బర్లీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, పామూరు, దొనకొండ, కొత్తపట్నం, ముండ్లమూరు, పొదిలి, తాళ్లూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల్లో 1088 మంది రైతులు 50,380 క్వింటాళ్ల నల్ల బర్లీ పొగాకును పండించారన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ కల్యాణ్రామ్ మాట్లాడుతూ హెచ్డీఎం రకం పొగాకును కిలో రూ.120 వంతున, హెచ్డీఎక్స్ రకం పొగాకును రూ.60 వంతున కొనుగోలు చేస్తామని తెలిపారు. పొగాకు రైతులు బేళ్లలో తేమ శాతం 20 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని, రెలుపు ఉన్న బేళ్లు అయితే మంచిది అన్నారు. మార్క్ఫెడ్కు అమ్ముకునే రైతులు ముందుగా వివరాలను సీఎం యాప్లో నమోదు చేసుకోవాలని అన్నారు. అలా నమోదు చేసుకున్న రైతులకు ఏరోజు ఏ ప్లాట్ ఫాంకు పొగాకు తీసుకు రావాలో వారి మొబైల్కు ముందస్తుగా సందేశం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు, జిల్లా మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్బాబు, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం ఫ్లోర్ లీడర్ శేషగిరిరావు, స్థానిక అధకారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పలువురు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా