
కన్నీటి రహదారి!
కనిగిరిరూరల్: తెలంగాణ రాష్ట్రం నకిరేకల్ నుంచి నల్గొండ, రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, చిన్నారికట్ల, పొదిలి, కనిగిరి, పామూరు, వెంకటగిరి తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద జాతీయ రహదారిని కలుస్తుంది ఈ ఎన్హెచ్ 565 రహదారి. తిరుపతికి, చైన్నె నగరానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఇన్ని ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి కోసం రైతులు విలువైన భూములను ఇచ్చారు. దాదాపు మూడున్నర కిలోమీటర్లు బైపాస్ను నిర్మాణానికి అధికారులు చకచకా భూ సేకరణ చేశారు. పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉన్నా పరిహారం విషయంలో భూములిచ్చిన వారు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారు. భూములిచ్చిన వారిలో బడాబాబులకు మాత్రం వెంటనే పరిహారాన్ని అందజేశారు. చిన్న సన్నకారులు రైతులు నిత్యం అధికారులు చూట్టూ తిరుగుతూనే ఉన్నారు. రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యమే వీరిపాలిట శాపంగా మారింది. న్యాయం చేయాల్సిన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే చేతులెత్తేస్తుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2014లో ప్రారంభమైన పనులు..
ఎన్హెచ్ 565 రోడ్డు పనులు 2014లో కనిగిరిలో ప్రారంభమయ్యాయి. కనిగిరి పట్టణంలోని కనిగిరి–కంభం క్రాస్ రోడ్డు, చెక్పోస్టు సమీపం నుంచి కనిగిరి– పామూరు రోడ్డు.. కొత్తూరు గుడి వరకు ఎన్హెచ్ 565 హైవే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి పట్టణ సమీపంలోని సుమారు 19 ఎకరాల భూమిని 20 నుంచి 25 సర్వే నంబర్లలో సేకరించారు. బడా, చిన్న, సన్నకారు రైతులు 100 మంది వరకు భూములు కోల్పోయారు. వీరు కాక మరో 30 నుంచి 40 మంది వరకు ప్లాట్లు కోల్పోయిన వారున్నారు. దాదాపు 140 మంది వరకూ భూములు ఇచ్చిన వారు ఉన్నారు. నష్ట పరిహారం కింద రూ.14 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో బడాబాబులకు మాత్రం రూ.10 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. మరో రూ.4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో రెండు విడతలుగా పరిహారం నగదు బాధితులకు జమ చేశారు. ఇంకా సుమారు 39 మంది సెంట్లల్లో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం రావాల్సి ఉంది. వారు కాకుండా ప్లాట్ల కోల్పోయిన సుమారు 30 మంది బాధితుల పేర్ల ఇంకా అసలు పరిహార జాబితాలోనే నమోదు కాలేదు. సర్వే నంబర్ 659, 709/3 లలో భూములు, ప్లాట్లు కోల్పోయిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. అనేక మంది భూ బాధితులు రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
పరిహారం ఫైళ్లు వెనక్కి..
భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో భూసేకరణ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 39 మంది బాధితులకు సంబంధించి పరిహారం కోసం పంపుతున్న ఫైలు ఇప్పటికీ మూడు సార్లు వెనక్కి వచ్చేసింది. తప్పు ఏ శాఖదైనా.. నిర్లక్ష్యం ఏ అధికారులదైనా భూములిచ్చిన వారు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ మూడు సార్లు ఫైలు వెనక్కి వచ్చిందంటే తప్పు ఎవరిదో అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫైనాన్షియల్ ఇన్ వాలిడ్ పేరుతో జాతీయ రహదారుల అథారిటీ ఉన్నతాధికారులు ఫైలును తిప్పి పంపారు. మార్చిలో మళ్లీ పంపగా తిరస్కరణకు గురైంది. తాజాగా మరో తప్పుతో పరిహార ఫైలు తిరస్కరించినట్టు శుక్రవారం జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్టు తెలిసింది. పరిహారం ఇచ్చే విషయంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తికావస్తున్న పనులు:
కనిగిరిలో ఎన్హెచ్ 565 రోడ్డు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. రోడ్డు పూర్తయితే తమను ఎవరు పట్టించుకుంటారని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. పరిహార జాబితా రీ ఫైనలైజేషన్ ఎప్పటికి జరుగుతుంది.. తమకు ఎప్పటికి పరిహారం దక్కుతుందని బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల పరిహార విషయం పై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి న్యాయం చేయాల్సిన జిల్లా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం.. అసలు తరచూ ఫైల్ ఎందుకు రిజక్ట్ చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టకపోవడంపై పలు విమర్శలకు దారితీస్తోంది.
ఎన్హెచ్ 565 నిర్మాణానికి 19 ఎకరాల భూసేకరణ భూములిచ్చిన రైతులు, ప్రజలు పరిహారం కోసం సగంమందికిపైగా బాధితుల ఎదురు చూపులు సాంకేతిక సాకులు చూపుతూ ముచ్చటగా మూడోసారి ఫైలు వెనక్కి కనిగిరి సమీపంలో పూర్తి కావస్తున్న బైపాస్ పనులు శాపంగా మారిన భూసేకరణ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రూ.4 కోట్ల బకాయిలు పెండింగ్ ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు
జాతీయ రహదారి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశ పడ్డారు. అధికారుల హామీలు నమ్మి భూములు ఇచ్చారు. జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులకు మాత్రం పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. భూసేకరణ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వీరి పాలిట శాపంగా మారింది. పరిహారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. బడా బాబులకు పరిహారం ఇచ్చేసిన అధికారులు చిన్న, సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సాకులు చూపుతూ ఇప్పటికీ మూడు సార్లు ఫైలు వెనక్కి వచ్చింది.
భూమి రాసి పోర్టల్ నుంచి రిటర్న్..
కనిగిరి ఎన్హెచ్ 565 బైపాస్ భూ బాధితుల పరిహారానికి సంబంధించిన ఫైల్ గతంలో ఒక సారి సాంకేతిక లోపంతో రిటన్ వచ్చింది. మళ్లీ రీఫైనలైజేషన్ చేసి పెట్టాం. మళ్లీ ఇప్పుడు రిటన్ వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. మా వైపు నుంచి మేము ఫైల్ను పరిశీలించే పంపుతున్నాం. పై నుంచి ‘భూమి రాసి పోర్టల్’ నుంచి రిటర్న్ వస్తోంది. దీనిపై సోమవారం మళ్లీ విజయవాడ టెక్నికల్ అధికారులతో మాట్లాడుతాం.
– గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్
నాటి మాటలు హామీలు ఏమయ్యాయి..?
ఎన్హెచ్ 565 రోడ్డు నిర్మాణ సమయంలో భూ బాధితులందరికీ న్యాయం చేస్తాం.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దు..దశల వారీగా నష్టపోయిన భూ బాధితునికి ప్రతి సెంటుకు పరిహారం ఇప్పిస్తామని పలు మార్లు సభలు, సమావేశాలు పెట్టి కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నత స్థాయి అధికారులు నమ్మబలికారు. రోడ్డు పనులు అడ్డు లేకుండా సాఫీగా జరుగుతున్నాయి. అయితే డివిజన్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం సన్న, చిన్న కారు రైతులకు పరిహారం అందించే విషయాన్ని విస్మరించారు. నష్ట పరిహార ఫైల్ మూవింగ్ విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సెంటు నుంచి ఐదు సెంట్ల భూములు, ప్లాట్లు కోల్పోయిన 39 మంది భూ బాధితులు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ పరిహారం కోసం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సుమారు రూ.3 కోట్లు బాధితులకు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. తమకు రావాల్సిన పరిహారం పై ఆందోళన చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.

కన్నీటి రహదారి!