నేతలు వీధికెక్కి ! | - | Sakshi
Sakshi News home page

నేతలు వీధికెక్కి !

May 28 2025 5:47 PM | Updated on May 28 2025 5:47 PM

నేతలు వీధికెక్కి !

నేతలు వీధికెక్కి !

మాటలు వేడెక్కి..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ముందస్తు రుతుపవనాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. అయితే మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చేసిన విమర్శలతో జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. అప్పటి నుంచి గత వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. దామచర్ల చేసిన విమర్శలకు ప్రతిగా జనసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు జడా బాల నాగేంద్ర ఎమ్మెల్యే దామచర్లపై విమర్శలు చేయడంతో కూటమిలో కుంపటి రాజుకుంది. అది ఈ విడత శృతి మించింది. టీడీపీ, జనసేన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మరింత వేడి రాజుకుంది. ఇరు పార్టీల నాయకులు పత్రికల్లో రాయలేని భాషలో తిట్టుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తిట్లను వినలేక ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అధికారం ఇచ్చి పరిపాలన చేయమంటే దాన్ని వదిలేసి కూటమి నాయకులు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రోడ్డున పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

దామచర్ల విమర్శలు వ్యక్తిగతమా...

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అవకాశం చిక్కినప్పుడల్లా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో బాలినేనిపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒంగోలును సర్వనాశనం చేసి హైదరాబాద్‌ వెళ్లి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడని విమర్శించారు. అంతేకాకుండా ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో హైదరాబాద్‌ పారిపోయి జనసేన పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. అయినా జనసేన నాయకులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. జనసేనలో మొదట్నుంచి రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ తొలి నుంచి దామచర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఆయన దామచర్లతోనే కొనసాగుతున్నాడు. దాంతో బాలినేనిపై దామచర్ల చేసిన విమర్శలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రియాజ్‌ చెబుతున్నారు. అంతేకాకుండా నిన్నా మొన్నటి వరకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగిన నాయకురాలు కూడా మౌనంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో జడా నాగేంద్ర కౌంటర్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

దామచర్లకు కౌంటర్‌ ఇచ్చిన నాగేంద్ర...

ఎమ్మెల్యే దామచర్ల చేసిన విమర్శలకు జనసేన నాయకుడు జడా బాల నాగేంద్ర కౌంటర్‌ ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో జనసేన మద్దతు వల్లనే దామచర్ల గెలిచాడని గుర్తు చేసిన ఆయన... బాలినేని ఏదో పార్టీలో చేరాడని విమర్శించడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి సొంతంగా బాలినేనిపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. 7 మంది పీఏలను పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నావని, నీ పాపాల చిట్టా లోకేష్‌ దగ్గర ఉందని ధ్వజమెత్తారు. ఒంగోలులో ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల వద్ద నుంచి జె.టాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరాయి.

వ్యక్తిగత విమర్శలతో వీధిలో పడ్డ కూటమి నాయకులు...

ఈ రెండు ఘటన తరువాత టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు శృతి మించి రాగాన పడ్డాయి. ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం మొదలుపెట్టారు. బాలినేని దయాదాక్షిణ్యాలపై నాగేంద్ర బతుకుతున్నాడంటూ పరుష పదజాలంతో టీడీపీ నాయకులు తిట్లదండకం అందుకున్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన నాగేంద్ర సైతం అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. దొంగలు, కిరాయి హంతకులు, కాల్‌మనీగాళ్లతో ప్రెస్‌మీట్‌ పెట్టించి బెదిరించాలనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యే దామచర్లను ప్రశ్నించారు.

నగరపాలక సంస్థలోనూ ఇదే తంతు..

నగర కార్పొరేషన్‌లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన కార్పొరేటర్ల మధ్య కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో చేరిన 14 మంది కార్పొరేటర్లు నగర మేయర్‌ గంగాడ సుజాత తీరుపై గుర్రుగా ఉన్నారు. మేయర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా వదిలిపెట్టడం లేదని, వారి నుంచి కూడా డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి కార్పొరేటర్లు ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకుంటూ అభివృద్ధి పనులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా నగరంలోని అనేక డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డివిజన్ల అభివృద్ధిపై దీని ప్రభావం కనిపిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు.

తెలుగుదేశం మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతో రేగిన చిచ్చు చల్లారడం లేదు. వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇరు పార్టీల నేతలు పరిధి దాటి పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషణలకు దిగుతున్నారు. కుటుంబసభ్యులను సైతం ఇందులోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమిలో తారస్థాయికి చేరిన విభేదాలు ఎమ్మెల్యే దామచర్ల విమర్శలతో రాజుకున్న చిచ్చు బాలినేనిపై విమర్శలు చేసినా పట్టించుకోని జనసేన నాయకులు బాలినేని అనుచరుడు జడా బాల నాగేంద్ర, టీడీపీ నాయకుల వ్యక్తిగత విమర్శలతో కాక రాయడానికి వీల్లేని భాషలో దూషించుకుంటూ వీధిన పడిన కూటమి నాయకులు వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement