కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన

May 28 2025 5:47 PM | Updated on May 28 2025 5:47 PM

కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన

కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన సాగుతోందని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, మరీ ముఖ్యంగా దళిత, మైనారిటీలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. తెనాలిలో మైనారిటీ, దళిత యువకులపై పోలీసులు చేసిన అమానుష ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ పది నెలల కాలంలో దళితులు, మైనారిటీలు, మహిళలపై దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. తెనాలిలో సభ్యసమాజం తలదించుకునేలా ఽథర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తూ ఒక సీఐ కాళ్లను తొక్కుతూ మరొక సీఐ లాఠీతో విరిగిపోయే వరకు కొడుతూనే ఉండటం చూస్తుంటే రాష్ట్రంలో రక్షణ ఏమాత్రం ఉందో అర్థమవుతుందన్నారు. యువకులు నేరం చేస్తే విచారణ చేయాలే గానీ నడిబజారులో దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సంఘటనను వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సంఘటనపై మానవహక్కుల సంఘం గానీ, ఎస్సీ కమిషన్‌ గానీ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై రోజు రోజుకూ దాడులు తీవ్రతరం అవుతున్నాయన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగిందని, దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఘటన బయటకు వచ్చినా ఇంత వరకు ఆ పోలీసులపై శాఖాపర చర్యలు తీసుకుంటామని ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు చేసినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు ప్రవర్తించిన సంఘటనతో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితులకు, మైనారిటీలకు, మహిళలకు భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల పట్ల ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. పవన్‌కళ్యాణ్‌ సొంత నియోజకవర్గంలోనే బహిష్కరిస్తే కనీసం అక్కడకు వెళ్లిన పాపాన పోలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన పాలకులు దళిత మైనారిటీలపై దాడులు జరుగుతుంటే కనీస స్పందన లేదని విమర్శించారు. సూపర్‌సిక్స్‌ అమలు చేయలేని టీటీడీకి మహానాడు జరుపుకునే అర్హత లేదన్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే దళిత హోంమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెనాలి ఘటనపై తక్షణమే స్పందించి నిందితులైన పోలీసులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ మాట్లాడుతూ తెనాలిలో యువకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం దళితులు, మైనారిటీలపై ఒక పథకం ప్రకారం దాడులు చేయిస్తోందన్నారు. గ్రామాల్లో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని కూటమి నేతలు ఇటువంటి ఘటన పట్ల మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం లేదన్నారు. తప్పుడు పనులు చేసే పోలీసులను వదిలిపేట్టే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ప్రతి పోలీసు గుర్తు పెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ యువకులను కిరాతంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, కార్పొరేటరు ఇమ్రాన్‌ఖాన్‌, మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షులు షేక్‌ సుల్తాన్‌భాషా, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్‌, దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

తెనాలి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసుల ప్రవర్తన

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement