30న జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

30న జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

May 28 2025 5:47 PM | Updated on May 28 2025 5:47 PM

30న జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

30న జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

ఒంగోలు: జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాల బాలికల క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 30న స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అంచిపోగు రమేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. జూనియర్స్‌ విభాగంలో 2010 జనవరి నుంచి 2011 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారు, సబ్‌ జూనియర్స్‌ విభాగంలో 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారు పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికకు హాజరయ్యే వారు ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాజట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9849760566 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

2న వాలీబాల్‌ సెలక్షన్స్‌

ఒంగోలు: స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయి) వాలీబాల్‌ క్రీడాకారుల ఎంపిక జూన్‌ 2న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్‌ జి.ధనుంజయరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 190 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు, 170 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలికలు ఎంపికకు అర్హులు. ఎంపికై న బాలబాలికలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ వైద్యుని మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, 5 పాస్‌పోర్టు సైజు ఫోటోలు, స్పోర్ట్సు సర్టిఫికెట్లు తీసుకుని ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 9490382802 నంబర్‌ను సంప్రదించాలని డాక్టర్‌ జి.ధనుంజయరావు విజ్ఞప్తి చేశారు.

సీనియారిటీ జాబితా సరిచేయాలి

ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులు పదోన్నతుల బదిలీకి సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి గ్రేడ్‌–2 హెచ్‌ఎంగా పదోన్నతుల జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మంగళవారం డిమాండ్‌ చేశారు. రూల్‌ ప్రకారం ఒకే డీఎస్సీలో నియామకం పొంది వివిధ సబ్జెక్టులకు పదోన్నతి పొంది ఒకే తేదీ జాయిన్‌ అయిన వారి ఇంటర్‌ సీనియారిటీ నిర్ణయించేటప్పుడు వారి సీనియారిటీ ఫీడర్‌ కేడర్‌ తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎం పదోన్నతుల జాబితా సరిచేస్తామని డీఈఓ కార్యాలయం ప్రకటించింది. వెంటనే ఆ జాబితా సరిచేసి గ్రేడ్‌–2 హెచ్‌ఎంల పదోన్నతుల జాబితా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

తాగునీటి చెరువులకే సాగర్‌ జలాలు

ఎస్‌ఎస్‌పీ ఎస్‌ఈ నాగమురళీమోహన్‌

కురిచేడు:

నాగార్జున సాగర్‌ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేనని ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ నాగమురళిమోహన్‌ తెలిపారు. మంగళవారం ఆయన సాగర్‌కాలువపై పరిశీలించారు. ఒంగోలు బ్రాంచికాలువ హెడ్‌ రెగ్యులేటర్‌, దర్శి బ్రాంచి కాలువ హెడ్‌రెగ్యులేటర్‌, త్రిపురాంతకం, జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు పర్యటించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సిబ్బంది తమ తాగునీటి చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక అట్లపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కలిపి విడుదల చేశారని, వారం రోజుల్లో కాలువ నిలిపివేస్తారన్నారు. నోటిఫై చెరువులు మాత్రమే నింపుకోవాలని, అలా కాకుండా నీటి చౌర్యానికి పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఈఈ రామకృష్ణ, డీఈఈ అక్బర్‌బాషా, ఏఈలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, సాంబశివరావు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement