
పొగాకు రైతుల సమస్యలపై పోరాటం
● ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
ఒంగోలు టౌన్: రాష్ట్ర మంత్రులు ఆర్భాటాలు చేయడం మానుకొని గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే చర్యల్లో భాగంగానే ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కంపెనీలు సరైన ధరలు ఇవ్వకపోవడం, సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికే నల్లబర్లీ సాగు చేసిన నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు ఆత్యహత్యలు చేసుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకును కొనుగోలు చేయించాలని కోరారు. వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని కంపెనీలు అసలు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి రామారావు తెలిపారు. వర్జీనియా పొగాకు ధరలను తగ్గించేందుకు కంపెనీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యారన్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని వివరించారు. ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి పొగాకును కొనాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు పోరాటాలు చేస్తామని చెప్పారు. సమావేశంలో రైతు నాయకులు హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, కిష్టిపాటి చిన్నపరెడ్డి, కనపర్తి సుబ్బారావు, శ్రీకాంత్, ఉషా వెంకటేశ్వర్లు, సోమయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, సింగయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.