బతుకులు చితికి! | - | Sakshi
Sakshi News home page

బతుకులు చితికి!

May 26 2025 1:33 AM | Updated on May 26 2025 1:59 AM

బతుకు

బతుకులు చితికి!

సంవత్సరం పొగాకు సరాసరి ధర 2014–15 రూ.81.37 2015–16 రూ.112.94 2016–17 రూ.116.47 2017–18 రూ.129.96 2018–19 రూ.118.23
అదో పీడకల.. 2014–19 మధ్య పొగాకు రైతులకు అన్నీ కష్టాలే.. ఆ రోజులు తలుచుకుంటేనే రైతు వెన్నుల్లో వణుకుపుడుతోంది. మద్దతు ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీస మద్దతు ధర సరాసరి రూ.118 దాటని పరిస్థితి. నష్టాలు మూటగట్టుకున్న రైతులు పొగాకు సాగుచేయాలంటే భయపడిపోయిన పరిస్థితులు నాడు నెలకొన్నాయి. నేడు అదే పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. వేలం ప్రారంభమై 70 రోజులు కావస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేలం కేంద్రాల్లో ధరలు రాకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన పొగాకు బోర్డు, కూటమి ప్రభుత్వం ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధర రోడ్డెక్కి..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

తెలుగుదేశం పాలన అంటనే రైతులకు ఓ శాపంలా మారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరల కోసం నిరంతర పోరాటాలు చేయాల్సిందే. అందుకు నిదర్శనం ప్రస్తుతం పొగాకు పంటకు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటయిన పొగాకు రైతుల వెన్నువిరిచేలా చంద్రబాబు పాలనలో ధరలు పతనమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్‌ ప్రకారం రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో రైతులు మద్దతు ధరల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2014–19 మధ్య సాగిన చంద్రబాబు పాలనలోనూ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వచ్చింది. అయినా రైతులకు మాత్రం మద్దతు ధరలు దక్కిన దాఖలాలు లేవు. దీంతో పొగాకు రైతులు తీవ్ర నష్టాలపాలై పొగాకు పంట సాగుచేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం అదే పరిస్థితులను పొగాకు రైతాంగం ఎదుర్కొంటోంది.

నాటి ఐదేళ్లూ తీవ్ర నష్టాలే...

చంద్రబాబు పాలనలో పొగాకు రైతులకు ఏనాడూ మద్దతు ధర దక్కిన పాపానపోలేదు. అందుకు 2014–19 మధ్య జరిగిన పాలనలో పొగాకు రైతులకు దక్కిన ధరలే నిదర్శనం. ఉమ్మడి ప్రకాశం జిల్లా కింద మొత్తం 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే.. అంటే 2014–15 సీజన్‌కు సంబంధించి పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పట్లో విదేశీ ఆర్డర్లు రావడం లేదనే కారణంతో పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో పండించిన పొగాకు అతి తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. 2014–15 సీజన్‌లో జిల్లాలో కేజీ పొగాకు సరాసరి ధర రూ 81.37 మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అసలు లోగ్రేడ్‌ రకం పొగాకుకు అయితే కేవలం రూ.45 కూడా రాని పరిస్థితి. ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ దెబ్బతో 2015–16 సీజన్‌లో పొగాకు సాగుచేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో బోర్డు అనుమతించిన పరిమితి కంటే కూడా రైతులు పొగాకును తక్కువగా పండించారు. సహజంగా మార్కెట్‌లో ఉత్పత్తులు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సీజన్‌లో కూడా పొగాకు రైతులు భిన్నమైన పరిస్థితినే ఎదుర్కొన్నారు. మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తులు లేకపోయినా వ్యాపారులు ధరలు మాత్రం పెంచలేదు. కేవలం ఆ ఏడాది వచ్చిన పొగాకు సరాసరి ధర రూ.112.94 మాత్రమే. దీంతో వరుసగా రెండేళ్లపాటు వచ్చిన తీవ్ర నష్టాలతో అనేక మంది రైతులు పొగాకు సాగు వదిలేసి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక, 2016–17, 2017–18 సీజన్లలోనూ పొగాకు రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం ఆ ఐదేళ్ల పాలనలో రైతులు ప్రతిరోజూ రోడెక్కి ధర్నాలు చేశారు. అయినా మార్కెట్‌లో ధరలు కల్పించడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి చంద్రబాబు పాలనలో పొగాకు రైతులు ఆనాటి ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటుండడం గమనార్హం.

పొగాకు రైతులకు అండగా వైఎస్‌ జగన్‌...

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు నష్టాల పాలవ్వగా, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకానొక సందర్భంలో మార్కెట్‌ ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అదనపు పొగాకు అమ్మకాలపై జరిమానాలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులకు అదనపు లాభం కూడా చేకూరింది. గతేడాది వరకు పొగాకు పంటకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధరలు దక్కాయి. కేజీ పొగాకు ధర రూ.366 పలకగా, సరాసరి ధర రూ.275 వరకు వచ్చింది. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరోసారి పొగాకు రైతుల పరిస్థితి తారుమారైంది. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డునపడే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు..

గతం తలుచుకుంటేనే భయమేస్తోంది...

గతం తలుచుకుంటే భయమేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 వరకు పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎన్ని ధర్నాలు చేసినా, పొగాకు వేలం నిలిపివేసినా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. అప్పుడు రైతులు ఇంకో పంట సాగుచేయలేక, వచ్చే ఏడాది ఽఅయినా ధరలు పెరుగుతాయని ఐదు సంవత్సరాలు పొగాకు సాగు చేసి అప్పులపాలయ్యారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో కూడా రైతులు లాభాలు పొందారు. అప్పటి పొగాకు వ్యాపారస్తులు ధరలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల్లో పోటీ పెంచి రైతులకు మద్దతు ధరలు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

– ఏలూరి వంశీకృష్ణ, పొగాకు రైతు, పొందూరు గ్రామం, టంగుటూరు మండలం.

టీడీపీ గత ఐదేళ్ల పాలనలోనూ పొగాకు రైతులకు దక్కని మద్దతు ధర ధరల కోసం నాటి చంద్రబాబు పాలనలోనూ ఐదేళ్లపాటు రైతుల పోరాటాలు మరోసారి చంద్రబాబు పాలనలో కుదేలవుతున్న పొగాకు రైతులు ప్రస్తుతం పొగాకు వేలంలో ధరలు రాక భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు ఆదుకునేందుకు కనీస ప్రయత్నం చేయని కూటమి ప్రభుత్వం

బతుకులు చితికి! 1
1/2

బతుకులు చితికి!

బతుకులు చితికి! 2
2/2

బతుకులు చితికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement