
ఒంగోలు నుంచే విజయభేరి
ఒంగోలు టౌన్: ఒంగోలు సభ నుంచే వైఎస్సార్ సీపీ విజయభేరి మొదలైందని, నియోజకవర్గ విస్తృతస్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకులు వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటింగ్ వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. ఇది జగనన్న మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఆదివారం ఒంగోలు నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ సభను తలపించింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య జై జగన్ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ గత జగనన్న ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా సుఖంగా ఉండాలన్న సదుద్దేశంతో సంక్షేమ పథకాల నగదును నేరుగా ప్రజలకు జగనన్న అందజేశారన్నారు. కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులు ఎక్కువగా ఉంటారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు. శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని, పొగాకుకు గిట్టుబాటు ధరలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవీ మండిపడ్డారు.
ఓట్లేయని వారికి కూడా సంక్షేమ పథకాలిచ్చిన జగనన్న : కారుమూరి నాగేశ్వరరావు
వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ తనకు ఓటేసిన వారితో పాటు ఓట్లేయని వారికి కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందజేస్తే, కూటమి పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను డాక్టర్లుగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దితే, దానికి నాలుగడుగులు ముందుకేసిన జగనన్న.. చదువుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని కొనియాడారు. అందుకు భిన్నంగా ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు.
పార్టీ మారిన కార్పొరేటర్లను చూస్తే
జాలేస్తోంది : చెవిరెడ్డి
ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లిన కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. కూటమి నాయకుల గొడవల మధ్య ఎలాంటి గౌరవం లేకుండా అనామకులుగా వారు కొనసాగుతున్నారని, మాతృపార్టీలోకి తిరిగి రావాలని, తిరిగి వచ్చిన కార్పొరేటర్లను తగిన విధంగా గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ప్రజల పోరాటాలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగిస్తూ జగనన్న పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం పనిచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు నాయకత్వంలో ఒంగోలు గడ్డపై వైఎస్సార్ సీపీ విజయపతాకాన్ని ఎగరేయడం ఖాయమన్నారు. ప్రత్యర్థులు సైతం ఉలిక్కిపడేలా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని చుండూరిని అభినందించారు.
జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే : తాటిపర్తి
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ఎవ్వరికీ తలవంచని జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టాయని విమర్శించారు. గుంపులుగా వచ్చినప్పటికీ తమ మీద తమకు నమ్మకం లేక చివరకు ఈవీఎంలతో మాయచేసి అధికారంలోకి వచ్చాయని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఇప్పటికే లిక్కర్ కుంభకోణం కేసు ఉందన్నారు. కూటమి పాలనలో బియ్యం, ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. సెకీ ఒప్పందం మీద ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2 రూపాయలు అదనంగా రేటు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారని, రొయ్యల వ్యాపారానికి క్రాప్ హాలిడే ప్రకటించారని, సినిమా హాళ్లను మూసేస్తున్నారని విమర్శించారు. స్కాములు చేయడం ఒక్కటే చంద్రబాబు పాలనలో జరుగుతోందన్నారు.
మాజీ మంత్రి, కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే ప్రాణమన్నారు. నాయకులను గెలిపించేది, వారి కోసం త్యాగాలు చేసేది కార్యకర్తలేనన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల సమయంలో తన మీద ఎల్లో మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని, పార్టీ కోసం ఏం చేయడానికై నా తాను సిద్ధమేనని చెప్పారు. మాజీ మంత్రి, సంతనూతలపాడు సమన్వయకర్త మేరుగు నాగార్జున ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేసిన వారంతా ఇప్పుడు తప్పు చేసినట్లు బాధపడుతున్నారన్నారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ వచ్చి తీరుతారని స్పష్టం చేశారు. మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు ప్రసంగిస్తూ ఒంగోలు సభ జిల్లాకే స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
ప్రజలను మోసం చేస్తున్న బాబు : జూపూడి
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో నాయకులకు కొరత లేదన్నారు. జగనన్న ఇస్తానన్న దానికి రెట్టింపు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒట్టిచేతులు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలనలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. ప్రపంచ స్థాయి రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం మంగళగిరి స్థాయి నగరాన్ని అయినా నిర్మించగలరా అని ప్రశ్నించారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు వేయాలని, పార్టీని అన్నివిధాలుగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన చుండూరి రవిబాబు ప్రసంగిస్తూ సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి కనరారావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేలాది మంది కార్యకర్తల నడుమ వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మార్మోగిన జగన్ నినాదాలు విజయోత్సవ సభను తలపించిన సమావేశం